పెళ్లి అంటే జీవితంలో ఒక కీలక ఘట్టం. చాలామంది ఇటీవల కాలంలో ఈ పెళ్లినే వద్దని అనుకుంటున్నారు. ఇంకొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి అన్ని మతాలు కూడా పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. వివాహ బంధం యొక్క పవిత్రతను అన్ని మతాలు చాటిచెబుతున్నాయి. ప్రత్యేకించి హిందూమతంలో పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. దాని ప్రాధాన్యతను చాలా చోట్ల ప్రత్యేకంగా వివరించారు. రామాయణంలో ‘‘ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన| వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||’’ అనే శ్లోకంలో పెళ్లి గురించి చక్కగా చెప్పారు. సీతామాతను రాముడికి ఇచ్చి పెళ్లి చేసే సందర్భంగా జనక మహారాజు చెప్పిన అద్భుత పదాలు ఈ శ్లోకంలో ఉన్నాయి. ‘‘ఓ రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మచారిణిగా ఈమెను అందిస్తున్నాను. ఈమె చేయి పట్టుకుని భార్యగా స్వీకరించు. నీకు అన్నీ శుభాలే జరుగుగాక’’ అని ఈ శ్లోకంలో జనక మహారాజు చెప్పారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లలో ఈ శ్లోకాన్ని చెబుతారు. సీతలాంటి నా కుమార్తెను రామచంద్రుడి లాంటి నీకు అప్పగిస్తున్నానని దీని అర్థం. ‘‘ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః’’ అనే మరో శ్లోకం వంశపరంపరను తెంచేయవద్దు అనే సందేశం ఇస్తుంది.
మూడు రుణాలు
ఋషి ఋణం, దేవ ఋణం, పితృ ఋణం అనే మూడు రుణాలను తీర్చుకునేందుకు పెళ్లి (Importance of Marriage) చేసుకోవాలని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మూడు రుణాలను తీర్చకుంటే మరోసారి మనిషిగా పుట్టి కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రుణాలను తీరిస్తే కైవల్యం దిశగా మన ప్రస్థానం సాగుతుంది.
మన జీవితంలో బ్రహ్మచర్య దశలో ఉండగా ఋషి ఋణం తీర్చుకోవాలి. అంటే వేదాలు చదవాలి, దైవారాధన చేయాలి, గురుపూజ చేయాలి, పురాణాలు చదవాలి మరియు వాటిని తర్వాతి తరాలకు అందించాలి.
దేవ ఋణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. అందుకోసం యజ్ఞ యాగాలు చేయాలి. దీనివల్ల దేవతలు తృప్తి చెంది సకాలంలో వానలు కురిపిస్తారు. పాడిపంటలతో లోకం సస్యశ్యామలం అవుతుంది.
పితృ ఋణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. ఇందులో భాగంగా మనం మంచి సంతానాన్ని పొందాలి, వంశాన్ని కొనసాగించాలి. తద్వారా పితృ ఋణం తీర్చుకోవచ్చు. పితృ ఋణం తీర్చుకోవాలంటే పెళ్లి తప్పకుండా చేసుకోవాలి. అందుకే వివాహం చాలా ముఖ్యమైనది.
