Kashi Vishwanath Temple: వారణాసిలోని ప్రముఖ కాశీ విశ్వనాథుడి ఆలయం (Kashi Vishwanath Temple) అధికారులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులు ఖాకీ యూనిఫాం (Police Uniform) ధరించే విధానానికి స్వస్తి పలికారు. ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నిర్ణయించారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు పోలీసులు ఇకపై ఖాకీ దుస్తులకు బదులు సంప్రదాయ ధోతీ, కుర్తాల్లో (Dhoti-Kurta) కనిపించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఖాకీ యూనిఫామ్తో కలిగే ప్రతికూల అభిప్రాయలను తొలగించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా, ఆలయంలో విధులు నిర్వర్తించే సమయంలో భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా మెలగాలనే విషయంపై పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాశీ విశ్వనాథుడి ఆలయ రినోవేషన్ తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అదే సమంయలో పోలీసులపై ఫిర్యాదులూ పెరిగాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులను బలవంతంగా పక్కకు నెడుతున్నారని అనేక మంది భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే భక్తులకు అసౌకర్యం కలిగించకుండా రద్దీని నియంత్రించేందుకు అధికారులు ‘నో టచ్’ విధానాన్ని (No Touch Policy) అవలంబిస్తున్నారు. భక్తులను నేరుగా తాకకుండా తాళ్లతో క్యూలైన్లను నియంత్రిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో భక్తులను చేతులతో తోస్తూ నియంత్రించేందుకు ప్రయత్నించరు.