Ayodhya Darshan : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమిని దర్శించుకునేందుకు రామభక్తులు రెడీ అవుతున్నారు. రేపటి(జనవరి 23) నుంచి సామాన్య భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం లభిస్తుంది. ప్రతి రోజు దాదాపు మూడు నుంచి ఐదు లక్షల మంది భక్తులు రామమందిరానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అయోధ్య రాముడిని దర్శించుకోవాలంటే (Ayodhya Darshan) ఏ నియమాలను పాటించాలి ? దర్శనం టైమింగ్స్ ఏమిటి? ఎలా వెళ్లాలి ? అనే అంశాలపై సమాచారం ఇదీ..
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి రేపటి నుంచి అయోధ్యకు పెద్దఎత్తున భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ రద్దీ దృష్ట్యా ఈ నెల 27 నుంచి దర్శనానికి వస్తే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ ట్రస్టు వర్గాలు చెబుతున్నాయి. ఆలయంలో భక్తులు ఉచిత ప్రవేశ దర్శనం పొందొచ్చు. దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఉచితంగా ప్రసాదం ఇస్తారు. ఒకవేళ స్పెషల్ దర్శనం కావాలని అనుకునేవాళ్లు ముందుగా తీర్థక్షేత్ర వెబ్సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా ఆఫ్లైన్లో కూడా టికెట్లు దొరుకుతాయి.
రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో మనం అయోధ్యకు చేరుకోవచ్చు. ఇటీవలే కొన్ని విమానయాన సంస్థలు అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్లు నడుపుతున్నాయి. అయితే, ప్రస్తుతానికి అవి బెంగళూరు నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కూడా విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలోని పలు ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి అయోధ్యకు నేరుగా ఇండియన్ రైల్వే రైళ్లను నడుపుతోంది.