చాలామంది అప్పట్లో పెద్దలు పాటించిన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు. అయితే వాటి వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి అన్నది తెలియకపోవచ్చు కానీ ఇప్పటికీ వాటిని చాలామంది అనుసరిస్తూనే ఉన్నారు. అటువంటి వాటిలో పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు అని నమ్మకం కూడా ఒకటి. ఈ విషయాన్ని పురాతన కాలం నుంచి చాలామంది పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ నమ్మకాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు.
అయితే పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి ఎందుకు బయటకు వెళ్ళకూడదు? దాని వెనక ఉన్న రీజన్ ఏంటి?అన్న వివరాల్లోకి వెళితే.. ప్రాచీన నమ్మకాల ప్రకారం పాలు తాగిన వెంటనే బయటకు వెళ్లడం వల్ల ప్రతికూల శక్తులు మనల్ని ఆకర్షిస్తాయి. కేవలం పాలే కాదు, ఏ ఆహారం అయినా తెలుపు రంగులో ఉన్నది తినడం లేదా తాగడం చేశాక బయటకు వెళ్ళకూడదు అని చెబుతారు. ఇవి ప్రతికూలతను ప్రేరేపిస్తాయని, దురదృష్టాన్ని తెస్తాయట. అయితే ఇది ఎంతవరకు నిజమో ఎవరూ తేల్చలేకపోయారు. తెల్లటి ఆహార పదార్థాలు తిన్నాక ఒక అరగంట సేపు ఇంట్లోనే ఉండి తర్వాత వెళ్ళమని సూచిస్తున్నాయి ప్రాచీన ఆచారాలు.
మధ్యాహ్నం, రాత్రి 12 గంటల సమయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయని ప్రాచీన ప్రజల నమ్మకం. అందుకే ఆ సమయంలో పాలు లేదా తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నాక బయటకు వెళ్లకుండా ఉండేవారట. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించి, ఇబ్బందులను తెస్తాయని వారి నమ్మకం. తెలుపు రంగు చంద్రుడిని సూచిస్తుంది. ఇది స్థిరత్వానికి, ప్రశాంతతకు చిహ్నం. అయితే తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్నాక రోడ్డు మీదకు వెళితే రాహువు వంటి ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయని ఒక నమ్మకం. అంతేకాదు హిందూ గ్రంధాల ప్రకారము రాహువు, చంద్రుడు ఇద్దరూ శత్రువులు. కాబట్టి తెలుపు రంగు ఆహార పదార్థాలు తిన్న వారిపై రాహువు ప్రభావాన్ని చూపిస్తుందని, చెడు జరిగేలా చేస్తుందని అంటారు.
ఈ విషయం గురించి సైన్స్ ఏం చెబుతోంది అన్న విషయంలోకి వెళ్తే.. సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా పాలు తాగిన వెంటనే బయటికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే కొందరిలో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే సమస్య ఉంటుంది. ఇది ఉన్నట్టు వారికి కూడా తెలియదు. ఈ సమస్య ఉన్న వారిలో పాలల్లో ఉన్న లాక్టోజ్ ను అరిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు తాగిన వెంటనే వాంతులు అవ్వడం లేదా విరోచనాలు కావడం వంటివి జరుగుతాయి. కాబట్టి పాలు తాగాక కాసేపు ఇంట్లోనే ఉండడం వల్ల ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకుని బయటకు వెళ్లొచ్చు.