పవిత్ర పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయం(Simhadri Appanna Temple)లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవలే చందనోత్సవం (Chandanotsavam ) సందర్భంగా జరిగిన విషాద ఘటన మరువకముందే, శనివారం (జూలై 5) గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో భాగంగా తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. అదృష్టవశాత్తూ అక్కడ భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, ఈ ఘటన ఆలయ నిర్వహణపై, ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Employee : ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
ఈ నెల 9న జరగనున్న గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు హాజరుకానుండగా, ముందస్తు ఏర్పాట్లలో రక్షణా ప్రమాణాలను పాటించకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షెడ్డు కూలిపోవడానికి కింద కాంక్రీట్ లేకపోవడమే ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో, కూటమి ప్రభుత్వంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే చందనోత్సవంలో ఏప్రిల్ 30న జరిగిన ఘటనలో 7 మంది మృతి చెందగా, 15 మందికి పైగా గాయాలయ్యాయి. ఇప్పుడు అదే ఆలయంలో మరో ఘటన జరగడంతో, ప్రభుత్వ నిర్లక్ష్యం మరోసారి ఎత్తిచూపబడింది.
ఇంతకముందు తిరుపతిలో కూడా జనవరి 8న వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కోసం నిలబడిన క్యూలైన్లలో తొక్కిసలాట జరగడంతో 6 మంది మృతి చెందగా, 44 మంది గాయపడిన సంగతి తెలిసిందే. పవిత్ర ఆలయాల్లో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విధంగా ఆలయాల్లో తగిన భద్రతా చర్యలు లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆలయాల నిర్వహణలో తీసుకుంటున్న నిర్లక్ష్యం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది.