Dussehra 2024 : 18 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ? వాటి ప్రాశస్త్యం ఏమిటి ?
Pasha
Dussehra 2024 : హిందువులకు అష్టాదశ శక్తిపీఠాలు ఎంతో పవిత్రమైనవి. అష్టాదశ శక్తి పీఠాలు అంటే 18 శక్తి పీఠాలు. కానీ కొందరు 51 శక్తి పీఠాలు ఉన్నాయని చెబుతుంటారు. మరికొందరు 108 శక్తి పీఠాలు(Dussehra 2024) ఉన్నాయని అంటుంటారు. దసరా పండుగ, దుర్గా ఉత్సవాల వేళ ఈ శక్తిపీఠాలను సందర్శించుకుంటే ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు.
శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ?
బృహస్పతి యాగం చేసేందుకు దక్షుడు అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ అల్లుడు శివుడు, కుమార్తె సతీదేవిని పిలవడు. తనను ధిక్కరించి శివుడిని పెళ్లి చేసుకోవడంతో కూతురు సతీదేవిపై దక్షుడికి కోపం ఉండేది. అందుకే వారిని యాగానికి పిలవలేదు.
తనను పిలవకున్నా ఆ యాగానికి సతీదేవి వెళ్తుంది. అయితే అక్కడ ఆమె అవమానానికి గురవుతుంది. తన తండ్రి చేస్తున్న శివనిందను సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి ప్రాణం తీసుకుంటుంది.
దీంతో కోపించిన శివుడు యాగశాలను ధ్వంసం చేస్తాడు.
సతీదేవి వియోగంతో ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకుని తన జగద్రక్షణ కార్యాన్ని శివుడు పక్కనపెట్టాడు.
చివరకు దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుడికి ఆయన విధిని గుర్తుచేస్తాడు.
శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి.
ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా భైరవుడు(శివుడు) దర్శనమిస్తాడు.
శాంకరి శక్తిపీఠం శ్రీలంక తూర్పు తీరంలో ట్రిన్కోమలీలో ఉంది. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వాళ్ల దాడుల్లో ఈ మందిరం దెబ్బతింది. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉంది.
కామాక్షి శక్తిపీఠం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని అంటారు.
శృంఖల శక్తిపీఠం కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలోని ప్రద్యుమ్ననగరంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని అంటారు. అక్కడి ప్రజలు అమ్మవారిని చోటిల్లామాతగా పిలుస్తారు. బెంగాల్లోని గంగాసాగర్ కూడా శక్తిపీఠమే అని అంటారు.
చాముండి శక్తిపీఠం కర్ణాటకలోని క్రౌంచ పట్టణంలో మైసూరు, చాముండి పర్వతాలపై ఉంది. ఇక్కడ అమ్మవారి కురులు పడ్డాయని నమ్ముతారు.
జోగులాంబ శక్తి పీఠం తెలంగాణలోని అలంపూర్లో ఉంది. సతీదేవి పైవరుస దంతాలు, దవడ భాగం ఇక్కడ పడ్డాయని అంటారు.
భ్రమరాంబిక శక్తిపీఠం ఏపీలోని శ్రీశైలంలో ఉంది. ఇక్కడే శివుడి ద్వాదశ జోతిర్లింగ క్షేత్రం కూడా ఉంది.
మహాలక్ష్మి శక్తి పీఠం మహారాషట్రలోని కొల్హాపూర్లో ఉంది. ఇక్కడ సతీదేవి కళ్లు పడ్డాయని అంటారు.
ఏకవీరిక శక్తిపీఠం మహారాష్ట్రలోని మాహుర్యంలో ఉంది. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడిందని అంటారు.
మహాంకాళి శక్తిపీఠం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. ఇక్కడ సతీదేవి పైపెదవి ఊడిపడిందని అంటారు.
పురుహూతిక శక్తిపీఠం ఏపీలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి పీఠభాగం పడిందని అంటారు.
గిరిజ శక్తిపీఠం ఒడిశాలోని జాజ్పూర్లో ఉంది. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిందని నమ్ముతారు.
మాణిక్యాంబ శక్తిపీఠం ఏపీలోని ద్రాక్షారామంలో ఉంది. ఇక్కడ సతీ దేవి ఎడమ చెంప భాగం పడిందని విశ్వసిస్తారు.
కామరూప శక్తిపీఠం అసోంలోని గౌహతిలో ఉంది. ఇక్కడి నీలచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందని నమ్ముతారు.
మాధవేశ్వరి శక్తిపీఠం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో ఉంది. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు.
వైష్ణవి శక్తిపీఠం హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాక్షేత్రంలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడుజ్వాలలు వెలుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని నమ్ముతారు.
మంగళ గౌరి శక్తిపీఠం బిహార్లోని గయలో ఉంది. ఇక్కడ సతీదేవి స్తనాలు పడినట్టు చెబుతారు.
విశాలాక్షి శక్తిపీఠం యూపీలోని వారణాసిలో ఉంది. ఇక్కడ సతీదేవి చెవి భాగం పడిందని అంటారు.
సరస్వతి శక్తిపీఠం పాక్ ఆక్రమిత కశ్మీరులోని ముజఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.