7 KG Gold Ramayana : అయోధ్య రామయ్యకు మరో అపురూప కానుక వచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ రూ.5 కోట్లతో తయారు చేయించిన 7 కిలోల బరువున్న ‘బంగారు రామాయణం’ గ్రంథాన్ని అయోధ్యలోని బాలక్రామ్ గర్భ గుడిలో ప్రతిష్ఠించారు. ఈ గ్రంథంలో 500 బంగారు పేజీలు ఉండటం విశేషం. అయోధ్య రామమందిరం గర్భగుడిలో భగవాన్ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ తన జీవిత సంపాదన మొత్తాన్ని రాంలాల్లాకు అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాట ప్రకారమే ఆయన రూ.5 కోట్లతో తయారు చేయించిన ‘బంగారు రామాయణం’ గ్రంథాన్ని బాలక్ రామ్కు కానుకగా అందజేశారు. ఇందులో 10,902 శ్లోకాలు ఉన్నాయి. గ్రంథంలోని ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత(7 KG Gold Ramayana) పూశారు. దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వాడారు.
We’re now on WhatsApp. Click to Join
ఈనెల 17న మనం శ్రీరామ నవమిని జరుపుకోబోతున్నాం. అయోధ్య రామమందిరంలో కలశ స్థాపనతో 9 రోజుల శ్రీ రామనవమి వేడుకలు ఇప్పటికే మొదలయ్యాయి. రాముడి ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా స్వామివారి వస్త్రాల శైలిని మార్చినట్లు అయోధ్య రామాలయ ట్రస్ట్ వెల్లడించింది. ఆలయ గర్భగుడిలో వెండి కలశం ఏర్పాటు చేశారు. 11 మంది వేద ఆచార్యులతో వాల్మీకి రామాయణంలోని నవః పారాయణం, రామ రక్షాస్త్రోత్, దుర్గా సప్తశతి పఠనంతో 9 రోజుల నవమి వేడుకలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయోధ్య రామాలయంలో రామకథా కార్యక్రమం ప్రారంభమైంది. అయోధ్యలోని మఠాలయాల్లో రామకథ, రాంలీలా, భజన సంధ్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున అయోధ్యలోని రామమందిరం అరుదైన ఖగోళ ఘట్టాన్ని చూడనుంది. ఆ రోజున ఆలయాన్ని సందర్శించే భక్తులు అరుదైన వార్షిక కార్యక్రమానికి సాక్ష్యులుగా నిలువనున్నారు. 17వ తేదీన రామ్ లల్లా విగ్రహం నుదుటిపై ‘దివ్య’మైన ‘సూర్య తిలకం’ సాక్షాత్కారం కానుంది. రామనవమి రోజు మధ్యాహ్నం నాలుగు నిమిషాల పాటు ఈ అద్భుత ఘట్టాన్ని భక్తులు చూడగలుగుతారు. ఈవిధంగా రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య తిలకం సాక్షాత్కారమయ్యేలా ‘సూర్య తిలక్’ యంత్రాంగాన్ని CSIR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CBRI) సంస్థ రూపొందించింది.