Allu Aravind: తెలంగాణలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీని సాధించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని సంఘాలు, ఇతర ముఖ్య సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదు అని ఆయన అన్నారు.
గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయన్నారు. ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నామని అల్లు అరవింద్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని అల్లు అరవింద్ పేర్కొన్నారు. కాగా ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి గోవా వేదికగా అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు హాజరు అయ్యారు.
నిర్వహణ లోపం వల్ల కొందరికి అసౌకర్యం ఏర్పడింది. దాంతో.. ఈ వేడుకలో తమని అవమాన పరిచారంటూ కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఇదే అంశంపై తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఒక వ్యక్తి చేసిన పనిని మొత్తం చిత్ర పరిశ్రమకు ఆపాదించడం సరైన పద్దతి కాదని అన్నారు.