దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’ పైరసీకి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక దృశ్యాలు, పాటలు హెచ్డీ క్వాలిటీతో ఆన్లైన్లో లీక్ కావడంతో నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే 300కు పైగా పైరసీ లింక్లను తొలగించారు. నిందితులపై కాపీరైట్, ఐటీ చట్టాల కింద కఠిన కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వెండితెరకు వీడ్కోలు పలుకుతూ నటించిన ఆఖరి చిత్రం ‘జననాయగన్’ చుట్టూ ఎన్నో వివాదాలు, అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ అడ్డంకులతో ల్యాబ్కే పరిమితమైంది. ఈలోగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ మూవీ ఇప్పట్లో విడుదల కాదని అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే హెచ్డీ ప్రింట్ లీక్ కావడం కోలీవుడ్ను షాక్కు గురిచేసింది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక దృశ్యాలు, పాటలు ఆన్లైన్లో లీక్ కావడంతో మేకర్స్ ఉలిక్కిపడ్డారు.
సినిమాలోని సుమారు ఐదు నిమిషాల నిడివి గల సీన్లతో కూడిన హై క్వాలిటీ కంటెంట్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంటనే అప్రమత్తమై తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక ఆధారాల సాయంతో వేగంగా దర్యాప్తు చేపట్టి ఈ లీకేజీకి కారకులుగా భావిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా లింక్ల ద్వారా ఈ అక్రమ కంటెంట్ను వైరల్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించి, వీరి వెనుక ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
పైరసీని అరికట్టేందుకు సైబర్ క్రైమ్ విభాగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు వివిధ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఉన్న 300కు పైగా అక్రమ లింక్లను బ్లాక్ చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం మరియు సినిమాటోగ్రాఫ్ యాక్ట్ కింద అత్యంత కఠినమైన సెక్షన్లను ప్రయోగించారు. కేవలం అప్లోడ్ చేసిన వారే కాకుండా, ఆ లింక్లను వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వేదికలపై ఫార్వర్డ్ చేసే వారిని కూడా వదిలిపెట్టబోమని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ లీకేజీపై చిత్ర బృందం తరపు న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ కంటెంట్ను ప్రోత్సహించడం చట్టపరమైన నేరమని, లీకైన వీడియోలను డౌన్లోడ్ చేయడం లేదా షేర్ చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలని కోరారు. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే ముందు వస్తున్న చివరి చిత్రం కావడంతో దాన్ని వెండితెరపై చూసి గౌరవించాలని, పైరసీతో సినిమాను దెబ్బతీయవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రం పైరసీకి గురికావడంపై కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలు, డైరెక్టర్లు తీవ్రంగా ఖండించారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే, మమిత బైజు వంటి తారాగణంతో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సెన్సార్ ప్రక్రియలో జాప్యం వల్ల ఇంకా అధికారిక తేదీ వెల్లడి కాలేదు. ఈ లోపే పైరసీ ఘటన జరగడం చిత్ర యూనిట్కు పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా, తమ అభిమాన హీరో చివరి సినిమాను థియేటర్లలోనే భారీగా సెలబ్రేట్ చేసుకుంటామని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు.
