జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం రేకెత్తించింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఖండన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ‘రెట్రో’ (Retro Pre Release) సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, కశ్మీర్ భారతదేశానికి చెందిందని, అక్కడి కశ్మీరీలు మనవారేనని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలకు సరైన విద్య లేకపోవడమే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు.
Pak Nationals: వామ్మో.. ఆ రాష్ట్రంలో ఐదువేల మంది పాకిస్థానీ పౌరులు
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం ‘ఖుషి’ సినిమా షూటింగ్ సందర్భంగా కశ్మీర్కు వెళ్లిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కడి ప్రజలతో తనకు ఉన్న మంచిసంబంధాలను ప్రస్తావిస్తూ, కశ్మీర్ మన దేశానికి ప్రత్యేకమైన భాగమని అన్నారు. పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా ఉందని, అక్కడ కరెంట్, నీరు వంటి ప్రాథమిక వసతులు లేకపోయినా, అక్కడి వారు భారత్పై దాడులకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. పాకిస్తాన్ ప్రజలే తమ ప్రభుత్వంపై తిరగబడే రోజులు త్వరలోనే వస్తాయని అభిప్రాయపడ్డారు.
అదే వేదికపై తమిళ స్టార్ హీరో సూర్య కూడా తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తన హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలోనైనా నష్టమే మిగులుస్తుందని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకూడదని ప్రార్థించారు. ఇక సూర్య నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ మే 1న విడుదల కానుండగా, ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.