M Arjuna Raju సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు (87) హైదరాబాద్లో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎన్టీ రామారావు నటించిన ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన ‘జేబుదొంగ’ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు శుక్రవారం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, అభిమానులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అర్జునరాజు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఖామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సహా పలు సినీ సంఘాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించాయి.
నిబద్ధతతో సినిమాలు నిర్మించిన నిర్మాతగా అర్జునరాజుకు ప్రత్యేక గుర్తింపు ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుతూ పలువురు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు శనివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా అర్జునరాజు విశిష్ట స్థానం సంపాదించారు. రోజా మూవీస్ పతాకంపై కె.శివరామరాజుతో కలిసి ఆయన సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. నందమూరి తారక రామారావు కథానాయకుడిగా తెరకెక్కిన ‘వేటగాడు’ చిత్రంతో నిర్మాతగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించి అర్జునరాజుకు నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే చిత్రాన్ని హిందీలో ‘నిషానా’ పేరుతో రీమేక్ చేయడం కూడా విశేషం. ఆ తర్వాత ఎన్టీఆర్తోనే ‘కొండవీటి సింహం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ, కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో ‘అడవి సింహాలు’, శోభన్బాబుతో ‘కోడెత్రాచు’, చిరంజీవి హీరోగా ‘జేబుదొంగ’ వంటి సినిమాలను నిర్మించి భారీ విజయాలను అందుకున్నారు. అక్కినేని నాగార్జునతో ‘బావ నచ్చాడు’, శ్రీకాంత్, సిమ్రాన్ జంటగా ‘మా నాన్నకు పెళ్లి’ చిత్రాలను నిర్మించారు.
తెలుగుతో పాటు హిందీలో కూడా అర్జునరాజు పలు చిత్రాలను నిర్మించారు. ‘ఫర్జ్ ఔర్ కానూన్’, ‘జానీ దోస్త్’ వంటి హిందీ చిత్రాలను రూపొందించి నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం కూడా సినీ నిర్మాణ రంగంతో అనుబంధం కొనసాగిస్తోంది. అర్జునరాజు తనయుడు ఎం. రామలింగరాజు కూడా నిర్మాతగా ‘మా అల్లుడు వెరీ గుడ్’, ‘జగపతి’ వంటి చిత్రాలు నిర్మించి విజయాలు అందుకున్నారు. దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో సేవలందించిన అర్జునరాజు మరణం టాలీవుడ్కు తీరని లోటుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
