Rebel Star : టాలీవుడ్‌లో విషాదం.. అనారోగ్యంతో క‌న్నుమూసిన రెబ‌ల్ స్టార్‌

'82 ఏళ్ల కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ రావడంతో చనిపోయారు

  • Written By:
  • Updated On - September 11, 2022 / 12:44 PM IST

సినీ న‌టుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 3.25కు తుదిశ్వాస విడిచారు. ఈయన 1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే తెలుగు సినీమాలో త‌న స‌త్తా చాటిన కృష్ణంరాజు.. 1999లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాకినాడ లోక్‌స‌భ నుంచి ఎంపీగా గెలిచారు. వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర‌మంత్రిగా కృష్ణంరాజు ప‌ని చేశారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జ‌న్మించారు. ఆయ‌న పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమా ప్రవేశం చేసిన రెబ‌ల్ స్టార్‌.. 187కు పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్. రాధేశ్యామ్ చిత్రంలో చివ‌రిసారిగా కృష్ణంరాజు న‌టించారు.

కృష్ణంరాజు మృతికి కారణాలు ఇవే!

పోస్ట్ కోవిడ్ ప్రభావం రెబెల్ స్టార్ కృష్ణంరాజు ప్రాణాలను తీసింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించారు. వాళ్లు చెప్పిన కారణాలు ఇవే.

’82 ఏళ్ల కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ రావడంతో చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారు.పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన చికిత్స అందించాం. ఆదివారం తెల్లవారుజామున 3.16గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు కన్నుమూశారు’’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఇంటికి తీసుకురానున్నారు. అనంతరం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.