Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. డీసీఎం కారును ఢీకొట్టడంతో!

  • Written By:
  • Updated On - March 18, 2024 / 02:08 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈమె వెండితెరపై, అలాగే బుల్లితెరపై అవకాశాలతో దూసుకుపోతున్నా విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెండితెరపై వరుసగా పాటలను పాడుతూ భారీగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అందుకు తగ్గట్టుగానే భారీగా పారితోషికాన్ని కూడా అందుకుంటోంది మంగ్లీ. ఈమె ఏ సినిమాలో పాట పాడిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును ఏర్పరచుకుంటూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే సింగర్ మంగ్లీకి ప్రమాదం జరిగిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారుని కర్ణాటకకు చెందిన ఒక డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం గత శనివారం మార్చి 16 అర్ధరాత్రి జరిగింది. హైదరాబాద్ బెంగళూరు హైవే పై తొండుపల్లి వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో జరుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరయ్యారు. అక్కడ కార్యక్రమం అనంతరం శనివారం రాత్రి హైదరాబాద్‌-బెంగళూర్‌ హైవే మీదుగా ఇంటికి బయల్దేరారు.

శంషాబాద్‌ మండలంలోని తొండుపల్లి వంతెన వద్దకు చేరుకున్న సమయానికి కర్ణాటకకు చెందిన ఒక డీసీఎం వేగంగా వచ్చి మంగ్లీ కారుని వెనుక నుంచి ఢీ కొట్టింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు శంషాబాద్‌ పోలీసులు తెలియజేసారు. ఇక ఈ ప్రమాదం జరిగినప్పుడు మంగ్లీతో పాటు కారులో డ్రైవర్ మేగరాజు, మనోహర్ కూడా ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కేవలం కారు మాత్రం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన అనంతరం మంగ్లీ అదే కారులో ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎవరికి ఏం జరగకపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.