తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సందడి నెలకొంది. దసరా పండుగను మరింత సందడి చేయడానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, కొత్త హీరో బెల్లంకొండ గణేశ్ తమ మూవీలతో సిద్దం అయ్యారు. అక్టోబర్ 5న వీరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.
ఇకపోతే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన పొలిటికల్ డ్రామా గాడ్ ఫాదర్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలో సందడి చేయటానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి స్టార్ట్ చేశారు. మలయాళం మూవీ లూసిఫర్ కి రీమేక్ గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. లూసిఫర్ చిత్ర దర్శకుడే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీకి కూడా దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆచార్య మూవీతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న మెగాస్టార్.. గాడ్ ఫాదర్ మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఇకపోతే.. కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా దసరా కానుకగా అక్టోబర్ 5న (బుధవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యాక్షన్ మూవీకి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఏజెంట్ గా కనిపించనున్నారు. గరుడవేగ హిట్ తరువాత ప్రవీణ్ సత్తార్.. బంగార్రాజు హిట్ తరువాత నాగార్జున కలిసి చేసిన ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి.
చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలు దసరాకు పోటీ పడుతుంటే.. ఈ రేసులో తాను కూడా సత్తా చాటుతా అంటూ వస్తున్నాడు సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేశ్. ఈ కుర్ర హీరో నటించిన తొలి సినిమా స్వాతిముత్యం కూడా అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కానుంది. నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.