Site icon HashtagU Telugu

Tollywood: టాలీవుడ్ లో ‘కరోనా’ కలకలం!

Tollywood Corona

Tollywood Corona

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుంటున్నా.. కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటూ విరుచుకుపడుతోంది. చిన్నా నుంచి పెద్దల వరకు.. సామాన్యుల మొదలు సెలబ్రిటీల దాకా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే టికెట్ల ఇష్యూ టాలీవుడ్ కోలుకోని దెబ్బ కొట్టగా, పుండు మీద కారం చల్లినట్టుగా కొవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు కు కరోనా సోకిన విషయం తెలిసిందే. మొదటి వేవ్ లో చాలామంది ప్రముఖులు కరోనా బారినపడినప్పటికీ మహేశ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంట్లో వ్యక్తిగత సిబ్బందికి నిత్యం టెస్టులు కూడా చేయించి కొవిడ్ దూరంగా ఉన్నాడు. ఈ థర్డ్ వేవ్ రాకతో మహేశ్ కరోనా బారిన పడక తప్పలేదు. ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

నటి మంచు లక్ష్మీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నాను. ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయాను అని పేర్కొంది. మామూలు జలుబు మాదిరిగా కరోనా మనల్ని వచ్చి చేరుతుందని, దానిని తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, విటమిన్ టాబ్లెట్స్ ను వాడాలని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ. ఇక కరోనా సోకిందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అధికారికంగా ప్రకటన ఇవ్వకున్నప్పటికీ ఆయన సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటికి వచ్చినట్లు వినికిడి. ఆయనకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. ఇక థమన్ కి కోవిడ్ సోకిందన్న వార్త తెలుకున్న అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇక హీరో నితిన్ భార్య, మహేశ్ బాబు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కరోనా బారిన పడి క్వారంటైన్ కు పరిమితమయ్యారు.

టాలీవుడ్ లో ప్రముఖులతో పాటు మరికొంతమంది టెక్నీషియన్స్ కరోనా బారిన పడటంతో.. ఆ ఎఫెక్ట్ సినిమా నిర్మాణలపై పడుతోంది. మహేశ్ బాబు హోంఐసోలేషన్ ఉండట వల్ల సర్కారువారిపాట, ఇతర సినిమా ప్రాజెక్టులపై ప్రభావం పడి ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. భీమ్లనాయక్, అఖండ సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్ చేతిలోనూ పలు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. కరోనా ధాటికి మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

Exit mobile version