ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోదీలో తనకు రాముడు, కృష్ణుడు వంటి మహనీయులు కనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా భరణి తన పోస్టులో “నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోదీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం” అని పేర్కొన్నారు.
తాను చూడని దైవ స్వరూపాలను, మహనీయుల అంశలను ప్రధాని మోదీలో చూశానని భరణి అభిప్రాయపడ్డారు. కేవలం ఆయన్ను చూడటమే కాకుండా, తాకడం, ఆయన చేతిని ముద్దాడటం ద్వారా తన జీవితం సార్థకమైందని ఆయన తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం తనికెళ్ల భరణి చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
