ప్రముఖ నటుడు విశాల్ (Vishal) భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. విశాల్ హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మార్క్ ఆంటోనీ చిత్రం రానుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని చెన్నైలో చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సీన్లో భాగంగా విశాల్ నేలపై పడిపోగా.. అదే సమయంలో వెనక నుంచి ఓ భారీ ట్రక్కు వేగంగా ఆయన పక్కన నుంచి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ విజువల్స్ను చిత్రబృందం విడుదల చేసింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర బృందం తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన విశాల్ ‘‘కొన్నిసెకన్లు, కొన్ని అంగుళాల దూరంలో చావును చూశా’’ అంటూ పోస్ట్ పెట్టారు.
చెన్నైలోని ఓ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో ట్రక్ అదుపు తప్పింది. సెట్లో కింద పడిపోయిన విశాల్ వైపు అదుపు తప్పి ట్రక్ వేగంగా దూసుకొచ్చింది. ట్రక్ వస్తుండటాన్ని గమనించిన చిత్ర యూనిట్ ఆయనని పక్కకి లాగారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డారు. గతంలోనూ కొన్ని సినిమాల చిత్రీకరణలో విశాల్ గాయపడ్డారు. నెటిజన్లు, అభిమానులు జాగ్రత్తగా ఉండండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty
Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu
— Vishal (@VishalKOfficial) February 22, 2023
ప్రస్తుతం విశాల్ నటిస్తున్న `మార్క్ ఆంటోని` చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ ఇందులో హీరోయిన్. ఎస్జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. పీరియడ్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలో కనిపించబోతున్నారు.