మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నారు క్రియేటివ్ డైరెక్షర్ సుకుమార్. ఈ విషయాన్ని సుక్కు నే సామజిక మధ్యమమైన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “మెగాస్టార్ను డైరెక్ట్ చేయాలనే నా కల నిజమైంది. వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తా” అంటూ చిరంజీవితో దిగిన ఫొటోని షేర్ చేశారు సుకుమార్. సుక్కు ప్రకటనతో సినీ అభిమానులు సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారు. ఓ కమర్షియల్ యాడ్ కోసం చిరు-సుక్కు కలిసి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కాంబినేషన్లో ఓ సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా ‘పుష్ప’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు సుకుమార్. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారాయన. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానుంది. మరోవైపు, యువ నటుడు విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని ఇప్పటికే ప్రకటించారు సుకుమార్. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. దీని తర్వాత మోహన్రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’, మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, కె. ఎస్. రవీంద్ర (బాబీ)తో ఓ చిత్రంతో పాటు వెంకీ కుడుముల డైరెక్షన్ లో మరో సినిమాను లైన్లో పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇవన్నీ పూర్తయిన తర్వాతే సుకుమార్ తో చిరంజీవి సినిమా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వీరి కలయికలో సినిమా అన్నది నిజమే అయితే.. ఇక మెగాస్టార్ ను సరికొత్తగా సుకుమార్ డైరెక్షన్ లో చూసే ఛాన్స్ ఉంటుంది.