ఇటీవల ఎన్టీఆర్(NTR) శత జయంతి ఉత్సవాలను అనేక చోట్ల ఘనంగా చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచంలో తెలుగు వారు ఉన్న ప్రతి దేశంలోనూ చేశారు. అమెరికా(America)లో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణలో భాగంగా నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్(NASAA) తో కలిసి ప్రముఖ నిర్మాత TG విశ్వప్రసాద్(Vishwa Prasad) న్యూజెర్సీ(New Jersey)లోని ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించాలని అనుకున్నారు. అమెరికాలో మొట్టమొదటి ఎన్టీఆర్ విగ్రహం అంటూ కొన్ని నెలల క్రితం వార్త వైరల్ అయింది. శత జయంతి రోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో అది జరగలేదు.
తాజాగా ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా పీపుల్స్ మీడియా అధినేత TG విశ్వప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ విగ్రహం గురించి, ఎందుకు ఆవిష్కరణ చేయలేదని ప్రశ్నించడంతో దీనిపై స్పందించారు.
TG విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి అన్ని అనుమతులు తీసుకున్నాం. ఆ నగర మేయర్ కూడా ఒప్పుకున్నారు. కానీ కొంతమంది వ్యతిరేకించారు. విగ్రహం పెట్టడాన్ని అడ్డుకున్నారు. అందుకే ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ జరగలేదు. ఆ సమస్యను పరిష్కరించి త్వరలో విగ్రహావిష్కరణ చేయాలని అనుకుంటున్నాము అని తెలిపారు. అయితే ఎవరు వ్యతిరేకించారో చెప్పలేదు కానీ తెలుగు వాళ్ళే కొంతమంది వ్యతిరేకించారని సమాచారం. దీంతో ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా తెలుగు వాళ్ళు అయి ఉండి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఎవరు అడ్డుకున్నారు అనే ప్రశ్న ఇప్పుడు చర్చగా మారింది. మరి అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహం ఎప్పుడు పెడతారో చూడాలి.