Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 4న తొక్కిసలాటకు బౌన్సర్ ఆంటోని ప్రధాన కారకుడిగా గుర్తించారు. బౌన్సర్లకు ఆర్గనైజర్గా పని చేస్తున్న ఆంటోనినే ఘటనకు కారకుడిగా పోలీసులు గుర్తించారు. నగరంలో ఎక్కడా ఈవెంట్ జరిగినా.. ఆంటోని బౌన్సర్లను ఆర్గనైజ్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంలోనూ ఆంటోనీనే బౌన్సర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బౌన్సర్ల అత్యుత్సాహం కూడా ఘటనకు ప్రధాన కారణంగా రెండ్రోజుల క్రితం పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బౌన్సర్ ఆంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు హీరో అల్లు అర్జున్కు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలు సాగిన ఈ విచారణ ముగిసినట్లు తెలుస్తుంది. అలాగే విచారణ అనంతరం సంధ్య థియేటర్ ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా, తొక్కిసలాట ఘటనకు సంబంధించిన 50కి పైగా ప్రశ్నలు అల్లు అర్జున్ను అడిగారు. లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ జరిగింది. చిక్కడపల్లి ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని బృందం ఆయన్ను విచారించింది. అయితే పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పలేదని తెలిసింది. కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగా.. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు సమాచారం. విచారణ తర్వాత.. అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అనంతర ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్లోని తన నివాసానికి పోలీస్ బందోబస్త మధ్య బయలుదేరారు.