Salman Khan: సల్మాన్‌ ఖాన్ కు సెక్యూరిటీ పెంపు.!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు రక్షణ పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - November 1, 2022 / 06:06 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు రక్షణ పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సల్మాన్‌కు Y ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అందించాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇదివరకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.

సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు వై ప్లస్ భద్రతను కల్పించారు. సల్మాన్‌తో పాటు అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌ల భద్రతను కూడా పెంచారు. సల్మాన్‌కు Y+ భద్రతను ఇవ్వగా, అక్షయ్, అనుపమ్‌లకు X-కేటగిరీ భద్రతను కల్పించారు. అక్షయ్, అనుపమ్‌ల భద్రతలో ముగ్గురు భద్రతా సిబ్బంది ఉంటారు. ఈ అదనపు భద్రత ఖర్చును నటీనటులు స్వయంగా భరిస్తారు.

సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ స్క్రీన్‌ప్లే రచయిత సలీం ఖాన్ మార్నింగ్ వాక్ తర్వాత బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లోని బెంచ్‌పై కూర్చున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి అక్కడ అతనిని, కొడుకును చంపేస్తానని బెదిరింపు లేఖను ఉంచినట్లు వార్తలు వచ్చాయి. తరువాత.. తన భద్రతా సిబ్బంది సహాయంతో సలీం ఖాన్ పోలీసులను సంప్రదించాడు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506-II (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అనంతరం సలీం ఖాన్, సల్మాన్ ఖాన్ వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు.

ఆగస్ట్‌లో గ్యాంగ్‌స్టర్ల నుండి ప్రాణహాని ఉందని పేర్కొంటూ దరఖాస్తు చేసుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు తుపాకీ లైసెన్స్ జారీ చేశారు. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్ నుండి నటునికి ప్రాణహాని ఉందని ఆరోపించిన తరువాత పోలీసులు అతని భద్రతను పెంచారు. కాగా.. సల్మాన్ ఇటీవలే డెంగ్యూ నుంచి కోలుకున్నాడు. అతను గత వారం రియాలిటీ షో “బిగ్ బాస్ 16” షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. 2010 నుండి “బిగ్ బాస్” హోస్ట్ చేస్తున్నాడు సల్మాన్.