ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసినా.. ఆర్ఆర్ఆర్ క్రేజ్ మాత్రం నేటికీ తగ్గలేదు. అయితే ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్స్ ప్రదర్శన ఉంటుందనీ ప్రతిఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఏం జరిగిందో ఏమోకానీ కేవలం నాటు నాటు సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే ఆ పాటను పాడారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ చేయకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇటీవల యూఎస్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన రామ్ చరణ్ నాటు నాటు పాటకు ఎందుకు డాన్స్ చేయలేదో వివరించాడు.
ఆస్కార్స్ వేదికపై నాటు నాటూ చేయాలనుకున్నట్టు రామ్ చరణ్ చెప్పారు. ’’డాన్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. అందుకోసం ముందుగానే ప్రిపేర్ అయ్యాను కూడా. కానీ, ఏం జరిగిందో నాకు నిజంగా తెలియదు. చివరి సమయంలో డాన్స్ ప్రదర్శన క్యాన్సిల్ అయ్యింది. అయినా ఆర్ఆర్ఆర్ టీం అద్భుతంగా ఆడిపాడింది’’ అని రామ్ చరణ్ అన్నారు. ఈ పాట ప్రదర్శన కోసం నిర్వాహకులు ముందుగానే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ను సంప్రదించారట. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఇక నాటు నాటు డాన్స్ ప్రదర్శన కోసం ఇండియన్ కళాకారులను పక్కనపెట్టి, విదేశీ ఆర్టిస్టులను ఎంపిక చేశారనే విమర్శ కూడా ఉంది.
Also Read: Student Suicide: TSPSC పేపర్ లీక్ ఎఫెక్ట్.. నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య!