Rajinikanth : సూపర్ స్టార్ అయిన తరువాత కూడా.. శుభ్రతలేని రైల్వే పట్టాలు దగ్గర భోజనం చేసిన రజినీకాంత్..

సూపర్ స్టార్ అయిన తరువాత కూడా శుభ్రతలేని రైల్వే పట్టాలు దగ్గర కూర్చొని భోజనం చేసిన రజినీకాంత్. శివాజీ మూవీ షూటింగ్ సమయంలో..

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 06:00 PM IST

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ సింపుల్‌సిటీ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇండియాతో పాటు ఇండోనేషియా, జపాన్ వంటి ఇతర దేశాల్లో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమా చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులను మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ వంటి బడా సెలబ్రిటీస్ ని కూడా తన అభిమానులుగా చేసుకున్న స్టార్‌డమ్ రజిని సొంతం.

అయితే ఇంతటి స్టార్‌డమ్ ఉన్నా.. రజినీకాంత్ మాత్రం ఒదిగే ఉంటారు. అంతేకాదు సినిమా విషయంలో కూడా ఇప్పటికీ కొత్త ఆర్టిస్టుగానే ప్రవర్తిస్తూ వస్తుంటారు. కొత్త ఆర్టిస్టులా చెప్పిన టైంకి సెట్స్ లో ఉంటూ ఒక క్రమశిక్షణ మెయిన్‌టైన్ చేస్తుంటారు. ఈక్రమంలోనే ‘శివాజీ’ సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువ టైం లేకపోవడంతో.. శుభ్రతలేని రైల్వే పట్టాలు దగ్గర కూర్చొని భోజనం చేసారు.

అసలు విషయం ఏంటంటే.. శివాజీ సినిమాలో హీరోయిన్ శ్రియా రైల్వే పట్టాలు దగ్గర రజినీకాంత్ పెళ్లి ప్రపోజల్ కి ఓకే చెప్పే సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సీన్ ని పూణేలో చిత్రీకరించారట. ఇక ఆ సీన్ చిత్రీకరించడం కోసం రైల్వే డిపార్ట్మెంట్ చాలా తక్కువ సమయమే ఇచ్చిందట. దీంతో లంచ్ చేయడం కోసం టైం లేకుండా పోయింది. అయితే దర్శకుడు శంకర్.. భోజనం చేయడం కోసం మూవీ టీంకి ఒక అరగంట టైం ఇచ్చారట.

దీంతో అందరూ భోజనం చేయడం కోసం అక్కడి నుంచి క్యారవాన్ దగ్గరికి వెళ్లారు. దర్శకుడు శంకర్ కూడా భోజనం చేయడానికి వెళ్లారు. కానీ రజినీకాంత్ మాత్రం.. ఆ దుర్వాసన వస్తున్న రైల్వే పట్టాలు దగ్గరే కూర్చొని భోజనం చేశారట. ఎందుకంటే భోజనం చేయడం కోసం క్యారవాన్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్లాలంటే ఇరవై నిమిషాల సమయం పడుతుందట.

శంకర్ ఇచ్చిన అరగంట సరిపోదని, షూటింగ్ జరగకపోతే మళ్ళీ రైల్వే పర్మిషన్ కూడా కష్టం అవుతుందని రజిని అక్కడే కూర్చొని భోజనం చేసేసారట. ఈ విషయం భోజనానికి వెళ్లి వచ్చిన తరువాత శంకర్ కి తెలిసిందట. సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత కూడా రజిని ఇంకా ఇలా డెడికేటెడ్ గా ఉండడం శంకర్ ని ఆశ్చర్యపరిచిందట.