పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘భీమ్లా నాయక్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా విడుదలై మూడో వారంలోకి ప్రవేశించినా… ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది. ఒక రీమేక్ మూవీ అయినప్పటికీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. రీజినల్ లాంగ్వేజ్ లో రిలీజై, రికార్డుల దుమ్ము దులపడం పవన్ కు మాత్రమే సాధ్యమని ‘భీమ్లా నాయక్’ చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది. ఇదంతా పక్కన పెడితే… లేటెస్ట్ గా ఓ న్యూస్ సామాజిగ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే… పవన్ తన నెక్స్ట్ మూవీ ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రంలో ప్రొఫెసర్ పాత్రలో నటించనున్నారట. ప్రస్తుతం ఈ వార్త అయితే తెగ చక్కర్లు కొడుతోంది.
‘పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్’ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా తెరకెక్కనుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ కలిసి మైత్రీ మూవీస్ బ్యానర్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను ఖరారు చేసుకుని, ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు కూడా. పవన్ కు ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్… ‘భవదీయుడు భగత్ సింగ్’ కు కూడా స్వరాలను సమకూర్చనున్నాడు. ఈ సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారనేది తాజా సమాచారం. పవన్ ను తన అభిమానులకు ఎలా చూపించాలో వందకు వందశాతం తెలిసిన హరీశ్ శంకర్… ‘భవదీయుడు భగత్ సింగ్’ లోనూ అలానే చూపించేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. పవన్ సరసన పూజా హెగ్డే ను ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. దర్శకుడు హరీశ్ శంకర్ తో ఆమె చేస్తున్న మూడో సినిమా ఇది. పవన్ తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది పూజా హెగ్డే.
ఇకపోతే ఇటీవల ‘భీమ్లా నాయక్’ తో భారీ విజయాన్ని నమోదు చేసిన పవన్ కళ్యాణ్….తన తదుపరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ఈ నెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాతే… పవన్ కళ్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.