టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు హిట్ లేక సతమతమవుతున్నాడు. అతనికి పెద్ద హిట్ వచ్చి చాలా రోజులైంది. 2018లో కామెడీ థ్రిల్లర్ టాక్సీవాలాతో విజయాన్ని అందుకున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా పెద్దగా విజయం సాధించలేకపోయింది. విజయ్ దేవరకొండ లైగర్ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి పాన్-ఇండియా మూవీపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ మూవీ నిరాశకు మిగిల్చింది. సమంత తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. విజయ్ దేవరకొండ సుకుమార్ కలిసి పనిచేయవచ్చని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఫైనల్ చేయలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’తో సక్సెస్ కొట్టిన పరశురామ్తో విజయ్ వర్క్ చేయనున్నట్టు తెలుస్తోంది. సర్కారు వారి పాట లాగా, పరశురామ్ విజయ్తో కమర్షియల్ సినిమా చేయలేడు. కాబట్టి విజయ్ దేవరకొండ కోసం ఒక ప్రేమకథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయి సెట్స్ పైకి వస్తే గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ ల రెండో ప్రాజెక్ట్ అవుతుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్కి అవసరమైన హిట్ అందించాడు పరశురామ్. విజయ్ కు పరశురామ్ మరో హిట్ అందిస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.