Eesha Rebba ప్రముఖ సినీ నటి ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాను పెట్టిన పోస్టు కింద అసభ్యకర కామెంట్లు పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని చెబుతూ ఆ అకౌంట్కు సంబంధించిన వివరాలను అందించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈషా రెబ్బ వరంగల్కు చెందిన తెలుగు నటి. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంలో హీరోయిన్గా నటించారు. ఇటీవల ‘ఓం శాంతి శాంతి’ చిత్రంలో నటించారు.
ఇటీవలి కాలంలో సినిమా తారలపై సోషల్ మీడియాలో కొంతమంది అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెట్టడం బాగా పెరిగింది. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖ హీరోల ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా కంటెంట్ను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటికి సంబంధించి వారు కోర్టులను కూడా ఆశ్రయించారు.
