యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా నిన్న రాత్రి చిత్రబృందం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేస్తూ, ఏకంగా 4 నిమిషాల 28 సెకన్ల నిడివి గల వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
ఈ గ్లింప్స్ ద్వారా ‘డ్రాగన్’ ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిచయం చేశారు. 1967 కాలం నాటి నల్లమందు తోటలు, ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ వంటి అంశాలతో కథ నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో నల్లమందును అత్యధికంగా పండించే ఆఫ్ఘనిస్థాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి ‘ప్రధాన హంతకుడు’గా ఆయన పాత్రను పరిచయం చేశారు. లీన్ అండ్ రఫ్ లుక్లో, గంభీరమైన స్వరంతో తారక్ అదరగొట్టారు. “దేవుడు నాకో గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం. నిద్రపోయినప్పుడు నేను చంపినవాళ్ల ముఖాలు నా కలలోకి రావు. మిగిలున్న శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావొద్దు” అంటూ ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ కథలో విలన్లను అడ్డుకునే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’గా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ను పరిచయం చేశారు. ఆయనతో పాటు మలయాళ నటుడు బిజూ మీనన్, అశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్ వంటి ఇతర కీలక పాత్రలను కూడా ఈ గ్లింప్స్లో చూపించారు. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది.
ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన ‘కేజీయఫ్’, ‘సలార్’ తరహాలోనే ఈ సినిమాకు కూడా డార్క్ థీమ్ను ఎంచుకున్నారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం, భువన్ గౌడ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు.
