తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. వామపక్ష పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్ను అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటును కోరనున్నారని తెలుస్తోంది.
தமிழ்நாட்டின் மக்கள் தீர்ப்பே இறுதி சக்தி.
மாற்றத்துக்காக மக்கள் எழுந்தால், வரலாறே திசை மாறும்.When people rise for change, history bends towards them.
Ennoda Thainadu Tamil Nadu…
Vanakkam Namasthe 🙏🏾❤️The very person who was trolled, mocked, targeted, and restricted in… pic.twitter.com/CElfzQRcKa
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 8, 2026
ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. విజయ్ విజయంపై తన ఆనందాన్ని, అభిప్రాయాలను పంచుకుంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. “తమిళనాడులో ప్రజల తీర్పే అత్యున్నత శక్తి. మార్పు కోసం ప్రజలు ఏకం అయితే చరిత్ర కూడా మారిపోతుంది” అని పేర్కొన్నారు. ఎన్నో విమర్శలు, ట్రోల్స్, అడ్డంకులు ఎదురైనా తన తొలి ఎన్నికల్లోనే విజయ్ సత్తా చాటారని కొనియాడారు.
“దళపతి విజయ్ అనే పేరు ఇప్పుడు సామాన్య ప్రజల్లో ఆశకు ప్రతీకగా మారింది. ప్రజలను గుండెల్లో పెట్టుకునే నాయకులను తమిళనాడు ఎప్పుడూ ఆదరిస్తుంది” అని మనోజ్ పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ విజయం కాదని, మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజల భావోద్వేగానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. డీఎంకే, ఏఐఏడీఎంకే మళ్లీ ఒక్కటవుతాయన్న ప్రచారాన్ని ఆయన పుకార్లుగా కొట్టిపారేశారు. దశాబ్దాలుగా ప్రజా తీర్పును గౌరవిస్తున్న ఆ పార్టీలకు ప్రజాస్వామ్య విలువల గురించి బాగా తెలుసని అభిప్రాయపడ్డారు.
“తమిళనాడు రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక శక్తి అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించడం చారిత్రక ఘట్టం” అంటూ విజయ్ ఎదుగుదలను ప్రశంసించారు. అతిపెద్ద పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయమని స్పష్టం చేశారు. చివరగా “ఇది కేవలం ఒక్క వ్యక్తి విజయం కాదు.. ప్రజల విశ్వాసానికి దక్కిన గౌరవం” అంటూ విజయ్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయ్ ఫొటోను షేర్ చేస్తూ, తాను దళపతి అభిమానినని మనోజ్ ప్రకటించారు.
