Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్నేహం గురించి అందరికి తెలిసిందే. ‘బుజ్జిగాడు’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎలాంటి స్నేహం అంటే.. ఇద్దరు ‘బావ బావ’ అని పిలుచుకునేంత స్నేహం. ఇప్పటికి కూడా ప్రభాస్.. మోహన్ బాబుని బావ అనే పిలుస్తారంట. అయితే ఈ స్నేహం కేవలం బావ అని పిలుచుకోవడంతో ఆగిపోలేదు, ఇంకా చాలా విశేషాలే ఉన్నాయట.
వాటిలో ఒక విషయాన్ని మంచు వారసురాలు లక్ష్మి రీసెంట్ గా తెలియజేసారు. ఓ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మంచు లక్ష్మి, ప్రభాస్ అండ్ మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. “మా నాన్న, ప్రభాస్ ఫోన్ చేసుకొని వంటలు గురించి మాట్లాడుకుంటారు. ప్రభాస్ ఆహారప్రియుడు అన్న సంగతి అందరికి తెలిసిందే. మా నాన్న కూడా అంతే. ఇక ఈ ఇష్టంతో వీరిద్దరూ ఒకరికి ఒకరు ఫోన్ చేసుకొని ఆడవాళ్ళ మాదిరి వంటల గురించి మాట్లాడుకుంటారు. మీ ఇంటిలో ఏ కూర మా ఇంటిలో ఈ కూర అని తెలుసుకొని, ఒకరి కూరలు ఒకరికి పంపించుకుంటారు” అంటూ చెప్పుకొచ్చారు.
కాగా ప్రభాస్ ప్రస్తుతం మోహన్ బాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, నయనతార.. ఇలా చాలామంది స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేసారు.