Manam : ‘మనం’ మూవీ వెంకటేష్ చేయాల్సింది.. కానీ అక్కినేని ఫ్యామిలీ..

'మనం' మూవీ అక్కినేని హీరోలు కాకుండా వెంకటేష్, సిద్దార్థ్ చేయాల్సింది. కానీ ఫైనల్ గా అక్కినేని ఫ్యామిలీకి..

  • Written By:
  • Publish Date - June 1, 2024 / 07:12 PM IST

Manam : అక్కినేని హీరోలంతా కలిసి నటించిన సినిమా ‘మనం’. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2014లో సూపర్ హిట్ టాక్ ని అందుకోవడమే కాదు, టాలీవుడ్ లో ఒక బ్యూటిఫుల్ మూవీగా నిలిచిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఫాంటసీ డ్రామాతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తూనే ఎమోషనల్ కూడా చేసింది. ఏఎన్నార్ నటించిన చివరి సినిమా కావడంతో.. అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.

అయితే ఈ సినిమా కథ.. ముందుగా వెంకటేష్ దగ్గరికి వెళ్లిందట. ఈ కథని రాసుకున్న తరువాత విక్రమ్ కుమార్.. అక్కినేని హీరోలను కాకుండా, మరో ముగ్గురు నటులను ప్రధాన పాత్రల కోసం అనుకున్నారు. వాటిలో మొదటి పాత్ర వెంకటేష్. నాగార్జున పోషించిన పాత్రని వెంకటేష్ తో చేయించాలని దర్శకుడు భావించారు. ఇక చైతన్య పాత్ర కోసం లవర్ బాయ్ సిద్దార్థ్ ని అనుకున్నారట. ఏఎన్నార్ పాత్రలో లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ ని చూపించాలని అనుకున్నారు.

కానీ కాలం ఆ స్క్రిప్ట్ ని అక్కినేని కుటుంబం దగ్గరికి తీసుకు వెళ్ళింది. అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ సినిమా ఎంతో మధురంగా అనిపించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చాలా క్లిష్టమైన స్క్రీన్ ప్లేతో మెప్పించింది. సాధారణంగా పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు అన్ని ఒకరి కథతోనే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కానీ మనం సినిమాలో మాత్రం.. ముగ్గురి కథలను పునర్జన్మల కాన్సెప్ట్ తో చూపించి.. విక్రమ్ కుమార్ దర్శకుడిగా వంద శాతం మార్కులు కొట్టేసారు.

ఇక ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని చూపించేలా.. విక్రమ్ రాసుకున్న కొన్ని అదనపు సీన్స్ కూడా ఆడియన్స్ తో విజుల్స్ వేయించాయి. ముఖ్యంగా మూవీ ఎండ్ లో అఖిల్ మాస్ ఎంట్రీ అదుర్స్ అనిపించింది.