Superstar Krishna: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు..!

టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

  • Written By:
  • Updated On - November 16, 2022 / 10:36 PM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 79 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. 14వ తేదీ రాత్రి గుండెపోటు రావడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. కృష్ణను ఐసీయూకి తరలించినా వైద్యులు కాపాడలేకపోయారు. సూపర్ స్టార్ అంత్యక్రియలు మహాప్రస్థానంలో బుధవారం ముగిశాయి. ఘట్టమనేని కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు ప్రముఖులు కన్నీళ్లతో తుది వీడ్కోలు పలికారు. ఆయన్ను కడసారి చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.

సూపర్ స్టార్ పార్థివదేహాన్ని మంగళవారం ఆయన స్వగృహంలో ఉంచారు. పలువురు నటీనటులు నానక్‌రామ్‌గూడలో నివాళులర్పించారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలించి నివాళులర్పించిన అనంతరం ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, నటీనటులు కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సూపర్ స్టార్ అంత్యక్రియలు ప్రారంభించి.. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి కృష్ణ భౌతికకాయానికి వందనం చేశారు. కృష్ణ కుమారుడు మహేశ్‌బాబు దహన సంస్కారాలు నిర్వహించారు.

మహేష్ బాబు కుమార్తె సితార తన తాత గురించి భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. “వారపు రోజు భోజనం మళ్లీ ఎప్పటికీ ఉండదు. మీరు మాకు చాలా విలువైన విషయాలు నేర్పించారు. ఎల్లప్పుడూ మమ్మల్ని నవ్వించారు. ఇప్పుడు మిగిలి ఉన్నది మీ జ్ఞాపకం మాత్రమే. నువ్వే నా హీరో… ఏదో ఒక రోజు నేను నిన్ను గర్వపడేలా చేయగలనని ఆశిస్తున్నాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తాత గారు” అని సితార తన తాతతో కలిసి దిగిన ఫోటోను పంచుకుంది.