Jeevitha Rajasekhar: పరువునష్టం కేసులో సినీనటులు జీవిత, రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దంపతులకు నాంపల్లికోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. వారు 2011లో చిరంజీవి బ్లడ్బ్యాంకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సినీ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లో పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్ దంపతులకు బెయిల్ మంజూరు చేసింది.
పరువు నష్టం కేసులో సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం నాడు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారు. అలాగే వారికి రూ.5 వేలు జరిమానా విధించారు. గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు.
Also Read: Taapsee : తాప్సీకి ఎన్ని బిజినెస్లు ఉన్నాయో తెలుసా? బాగా సంపాదిస్తుందిగా..
చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్ట్ సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. 2011లో వారి ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సీడీ రూపంలో కోర్టుకు అందించారు. దీనిపై కోర్టు సుదీర్ఘ విచారణ జరిపింది. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించింది. తర్వాత రాజశేఖర్, జీవితకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరు బెయిల్ బాండ్ల రూపంలో పూచీకత్తులను సమర్పించి కోర్టు నుంచి విడుదలయ్యారు.