Megastar: లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 28వ వర్ధంతి, ఎఎన్ఆర్ శత జయంతి కార్యక్రమం జరిగింది. యండమూరి వీరేంద్రనాథ్ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులతో కలిసి సత్కరించి సాహిత్య పురస్కారం కింద రూ.2 లక్షల నగదు గల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. తాను సినిమా హీరోగా ఎదగడానికి యండమూరి వీరేంద్రనాథ్ రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. యండమూరి రచనల నుంచి వచ్చిన పాత్రలే తన సినీ ప్రయాణానికి మెట్లుగా ఉపాయోగపడ్డాయని చిరు చెప్పారు.
పెద్దలు ఏది చెప్పిన మన మంచికే చెబుతారన్నారు. బలహీనతలను ఎప్పుడు బలంగా మార్చుకోవాలని ఎఎన్ఆర్ పలుమార్లు చెప్పాడని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ జీవితం శాశ్వతం కాదని, విలాసవంతమైన వస్తువులు బదులుగా ఇళ్లు, స్థలాలు కొనుక్కోవాలని ఎన్టిఆర్ సలహా ఇచ్చేవారని పేర్కొన్నారు. యండమూరి రాసిన నవల చిత్రాలతోనే తనకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చిందన్నారు.
అభిలాష అనే నవల గురించి తన తల్లి చెప్పిందని, అదే నవలలో కీలక పాత్రను తనను పెట్టి కెఎస్ రామారావుగారు సినిమా తీశారని గుర్తు చేశారు. అందుకే తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతలను యండమూరికి అప్పగించానని చిరు తెలిపారు. ‘ఛాలెంజ్’ అనే సినిమా ఎంతో యువతను ప్రభావితం చేసిందన్నారు. ‘సంఘర్షణ’ సినిమా షూటింగ్ సమయంలో స్టంట్ చేస్తున్నప్పుడు తాను గాయపడడంతో ఆరు నెలలు సినిమాలో షూటింగ్ ఆపాల్సి వచ్చిందని చిరంజీవి గుర్తు చేశారు. సీనియర్ నటుల నుంచి ఎంతగానో నేర్చుకున్నానని అన్నారు.