Actress Sneha తెలుగు వెండితెరపై తనదైన అభినయంతో హోమ్లీ ఇమేజ్ను సొంతం చేసుకున్న నటి స్నేహ, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన ప్రమాదం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఈమె, అంతకుముందే ఒకానొక దశలో తన సినీ ప్రయాణం ముగిసిపోయిందని భావించినట్లు వెల్లడించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం తన జీవితాన్ని తలకిందులు చేసిందని, ఆ సమయంలో పడిన వేదనను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఆ ప్రమాదంలో కాళ్లు, చేతులు, వీపు భాగానికి తీవ్రమైన గాయాలయ్యాయని స్నేహ తెలిపారు. కనీసం మంచం మీద నుండి లేచి నిలబడాలన్నా ఎనిమిది నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పడంతో, ఇక తను కెమెరా ముందుకు రావడం అసాధ్యమని అనుకున్నానని చెప్పారు. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు కరు పళనియప్పన్ ‘పార్థిబన్ కనవు’ (తెలుగులో ‘అంజలి ఐ లవ్యూ’) కథతో ఆమెను సంప్రదించారు. తాను కదల్లేని స్థితిలో ఉన్నానని తెలిసినా, ఆ దర్శకుడు చూపిన నమ్మకం, ఇచ్చిన ప్రోత్సాహం తనలో కొత్త ఆశలు చిగురింపజేశాయని స్నేహ తెలిపారు. ఆ మొండి ధైర్యంతోనే కోలుకుని మళ్లీ మేకప్ వేసుకున్నానని, ఆ సినిమా తన కెరీర్ను మలుపు తిప్పిందని ఆమె వివరించారు.
