ప్రజల్లో సినిమా క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త పంథాలు అవలంబిస్తున్నారు. తాజాగా ‘బాహుబలి ది ఎపిక్’ సినిమాపై ఏర్పడిన హైప్ను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో కొందరు దందా ప్రారంభించారు. ప్రీమియర్ షో టికెట్లు ఉన్నాయని, కావాలంటే మెసేజ్ చేయాలని ఒకరు “Heisenberg M” అనే పేరుతో ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశారు. బాహుబలి ఫ్రాంచైజ్కి ఉన్న భారీ ఫ్యాన్ఫాలోయింగ్ కారణంగా చాలామంది ఆ ట్వీట్ను నమ్మి, అతనికి మెసేజ్ చేశారు. “టికెట్లు లిమిటెడ్.. వెంటనే బుక్ చేసుకోండి” అంటూ ఆ వ్యక్తి చెప్పిన 9391872952 నంబర్కి కొంతమంది డబ్బులు పంపారు. అయితే డబ్బులు పంపిన వెంటనే ఆ నంబర్ నుండి వారిని బ్లాక్ చేశాడు.
ఈ ఘటనతో మోసపోయిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. “మేము టికెట్లు కొంటామని నమ్మి పేమెంట్ చేశాం, కానీ వెంటనే బ్లాక్ చేశారు” అంటూ నెటిజన్లు వాపోతున్నారు. ఇలాంటి ఫేక్ అకౌంట్లను గుర్తించి, సైబర్ పోలీసులకు రిపోర్ట్ చేశారు. మరోవైపు కొందరు స్క్రీన్షాట్లు షేర్ చేస్తూ, ఇది కచ్చితంగా స్కామ్ అని స్పష్టం చేస్తున్నారు. సినిమా టికెట్లు లేదా ప్రత్యేక షోల పేరుతో డబ్బులు అడిగే సోషల్ మీడియా అకౌంట్లను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.
పోలీసులు ఇప్పటికే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. “అధికారిక బుకింగ్ ప్లాట్ఫార్మ్ల ద్వారానే టికెట్లు కొనాలి, సోషల్ మీడియా ద్వారా డబ్బులు పంపరాదు” అని సైబర్ క్రైమ్ విభాగం సూచించింది. బాహుబలి వంటి భారీ సినిమాల విడుదల సమయాల్లో అభిమానుల్లో ఉత్సాహం అధికంగా ఉంటుందని, ఆ భావోద్వేగాన్ని మోసగాళ్లు ఉపయోగించుకుంటారని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి పోస్టులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
