Site icon HashtagU Telugu

Tollywood : సినీ కార్మికుల యవ్వారం మళ్లీ మొదటికే.. చర్చలు విఫలం!

Producers Press Meet Finali

Producers Press Meet Finali

తెలుగు సినీ పరిశ్రమ(Tollywood)లో గత కొద్ది రోజులుగా నిలిచిపోయిన షూటింగ్‌ల వివాదంపై నిర్మాతల మండలి మరియు సినీ కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల తర్వాత, నిర్మాతల మండలి వేతనాలు పెంచడానికి సుముఖత వ్యక్తం చేసింది, కానీ దానిని దశలవారీగా మూడు విడతలుగా అమలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడత పెంపు వెంటనే అమలవుతుందని, రెండవది కొన్ని నెలల తర్వాత, మూడవది ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవుతాయని భావించారు. ఈ విషయాలను ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు.

Raksha Bandhan : రక్షాబంధన్ పండుగలో క్రికెట్ స్టార్ల సరదా సందడి.. సోదరీ-సోదరుల ఆప్యాయతలు

దామోదర ప్రసాద్ వివరించిన దాని ప్రకారం..రోజుకు రూ. 2,000 కన్నా తక్కువ వేతనం పొందే కార్మికులకు మూడు సంవత్సరాల పాటు దశలవారీగా వేతనాలు పెంచుతారు. అదేవిధంగా రోజుకు రూ.1,000 కన్నా తక్కువ వేతనం పొందే వారికి వెంటనే 20% పెంపు ఉంటుంది. వీరికి రెండో సంవత్సరంలో పెంపు ఉండదు, కానీ మూడో సంవత్సరంలో మరో 5% పెంపు చేస్తారు. చిన్న సినిమాల విషయంలో మాత్రం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాత వేతనాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే రోజుకు రూ.4,000-రూ.5,000 పొందుతున్న వారికి వేతనం పెంచడం సరికాదని నిర్మాతలు పేర్కొన్నారు.

అయితే నిర్మాతల ఈ ప్రతిపాదనలను కార్మిక సంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తిరస్కరించారు. నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపు కేవలం 10 సంఘాలకే పరిమితం అవుతుందని, వారు విధించిన 4 షరతులను తాము అంగీకరించబోమని ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనలు ఫెడరేషన్‌ను విభజించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. నిర్మాతలు తిరిగి చర్చలకు పిలిస్తే వస్తామని, లేకపోతే తమ నిరసనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం ఇంకా పరిష్కారం కాలేదని తేలింది.