ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్ (Johnny Lever) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 1990 లలో సంవత్సరానికి కనీసం డజను సినిమాల్లో యాక్ట్ చేసేవారు. అయితే, గత కొన్ని దశాబ్దాల వ్యవధిలో ఆయన మూవీ వర్క్ చాలా తగ్గిపోయింది. ఇటీవల కాలంలోనైతే ఆయన ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేశారు. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే జానీ సినిమాల్లో ఎందుకు ఎక్కువగా నటించడం లేదు? దీనికి సమాధానం స్వయంగా జానీ ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
“ఇటీవల కాలంలో కామెడీ చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. ఇది మొదటి కారణం. హీరోలు కూడా సినిమాలలో నా ఉనికిని చూసి భయపడి పోతున్నారు. ఇది రెండో కారణం. నేను మూవీలో ఎక్కడ హైలైట్ అయిపోతాననే ఆందోళనతో మూవీ ఫైనల్ కట్ లో నా సీన్స్ ను తీసేస్తున్నారు.. తగ్గిస్తున్నారు.. నా సన్నివేశాలకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనే అభద్రతాభావం వల్ల ప్రధాన నటులు ఇలా చేస్తున్నారు. హీరో స్థాయి వాళ్ళు కూడా తమ కోసం కామెడీ సన్నివేశాలను రూపొందించమని రచయితలను అడిగే టైం ఇప్పుడు నడుస్తోంది. దీంతో చేసేదేం లేక సినిమా రైటర్స్ మూవీలో హీరోల కోసం హాస్య సన్నివేశాలను రాస్తున్నారు. దీనివల్ల నాలాంటి కమేడియన్ల పాత్రలు సినిమాల్లో చిన్నవిగా మారిపోతున్నాయి. ఇప్పుడొస్తున్న సినిమాలను గమనించండి. మీకు ఈ విషయం తెలిసిపోతుంది. కామెడీ పని అయిపోయింది.” అని జానీ లీవర్ వివరించారు.”నేను నా సీన్స్ ను చాలా మెరుగుపరిచాను. హాస్య సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా చేయడానికి చిత్ర నిర్మాతలు నాపై ఎంతో ఆధారపడేవారు” అని జానీ చెప్పారు.
జానీ లీవర్ స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించారు. లైవ్ షోలలో మిమిక్రీ చేసేవాడు. అనంతర కాలంలో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. దీంతో 300 కంటే ఎక్కువ హిందీ చిత్రాలలో జానీ లీవర్ పని చేశారు. షారుఖ్ ఖాన్, కాజోల్ , శిల్పాశెట్టి నటించిన 1993 థ్రిల్లర్ మూవీ బాజీగర్ లో క్లూలెస్ బాబులాల్ పాత్రకు జానీ లీవర్ ప్రసిద్ధి చెందారు. దీవానా మస్తానా, దుల్హే రాజా మూవీస్ లో ఉత్తమ నటనకు జానీ రెండుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. జానీ లీవర్ కుమార్తె జామీ , కుమారుడు జెస్సీ. జామీ, జెస్సీ తమ తండ్రిలాగే వినోద పరిశ్రమలోకి వచ్చారు. హౌస్ ఫుల్ 2 (2019) అనే కామెడీ చిత్రంలో తండ్రీ కూతుళ్లు జానీ, జామీ కలిసి పనిచేశారు.
Also Read: Budget : రాబోయే బడ్జెట్లో వేతన జీవులకు ఆదాయపు పన్నులో ఊరట లభిస్తుందా?