వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2013లో విడుదల భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపుగా 12 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమాను మార్చి ఏడవ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రీ చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్నో రకాల ప్రశ్నల పై స్పందించారు.
మార్చి 7న దీనిని రీ రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికే 10 థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ రాణిస్తోన్న ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించడం లేదనే స్టేట్మెంట్ ఎంతగానో ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. మా సినిమా ఓటీటీలో, టీవీల్లోనూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రసారమైంది. అయినప్పటికీ రీ రిలీజ్లో వెండితెర వేదికగా దీనిని వీక్షించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ఉంటే చూడటానికి ఆడియన్స్ ఎల్లప్పుడూ ముందుంటారు. మహేశ్, వెంకటేశ్ అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా దీనిని చూడటానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రేక్షకుల రియాక్షన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మంచి సినిమాలు చేయడానికే మనం ప్రయత్నించాలని ఇలాంటి రీ రిలీజ్లు మరోసారి స్పష్టం చేస్తున్నాయి అని దిల్ రాజు తెలిపారు.
రీ రిలీజ్ ట్రెండ్ వల్ల.. ఆ రోజు వచ్చే కొత్త సినిమాలకు ఇబ్బంది కలగడం లేదా? అని అడగగా.. దిల్ రాజు స్పందిస్తూ.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటేనే కదా ఇప్పుడు పది థియేటర్లు ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు కోరుకునేది మాత్రమే మనం ఇవ్వాలి. ప్రేక్షకులు కోరుకోకుండా మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్లకు నచ్చకపోతే మార్నింగ్ షోకే బై బై చెబుతున్నారు. దానికితోడు సోషల్ మీడియా ట్రోలింగ్ మరో స్థాయిలో ఉంటుంది. ఒక సినిమాని నాశనం చేసే వరకూ వదిలిపెట్టడం లేదు. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయొద్దు ఈ సినిమానే చూడండి అంటే చూస్తారా? చూడరు. ఇంట్లోనే కూర్చొంటున్నారు. వాళ్లంతా క్లారిటీగా ఉన్నారు. టీజర్, ట్రైలర్లు చూసే ఇది చూడాలా? వద్దా? అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. ఆన్లైన్ బుకింగ్ యాప్స్ ఓపెన్ చేయగానే మా సినిమా రిజల్ట్ ఏంటో రిలీజ్ కు ముందే మాకు తెలిసిపోతుంది అని తెలిపారు దిల్ రాజు.