‘కోర్ట్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యువ జంట హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి అపల్లా, ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ అనే క్యూట్ లవ్ స్టోరీతో మళ్ళీ అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, మార్చి 13న విడుదలకు సిద్ధంగా ఉంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేసిన చిత్ర బృందం, ప్రమోషన్స్ లో భాగంగా వినూత్నంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి అపల్లా మాట్లాడుతూ.. తన కెరీర్లో ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని, ‘కోర్ట్’ తర్వాత తాను విన్న మొదటి కథ ఇదేనని తన ఉత్సాహాన్ని పంచుకుంది.
ఈ సినిమాలో తన పాత్ర గురించి శ్రీదేవి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘బ్యాండ్ మేళం’లో ఆమె ‘రాజమ్మ’ అనే పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, సినిమా ప్రథమార్థంలో కడుపుబ్బ నవ్వించే రాజమ్మ పాత్ర, క్లైమాక్స్లో అందరినీ ఏడిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. దర్శకుడు సతీష్ జవ్వాజి ఈ కథను రెండున్నర గంటల పాటు నిలబడే నేరేట్ చేశారని, కథలోని బలం చూసి వెంటనే ఒప్పుకున్నానని తెలిపింది. విజయ్ బుల్గాని అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, ముఖ్యంగా తన కో-స్టార్ హర్ష్ రోషన్ తో కెమిస్ట్రీ ఈసారి మరింత మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
గ్లింప్స్ విడుదల వేడుకలో యాంకర్ స్రవంతి చొక్కారపు అడిగిన ఓ సరదా ప్రశ్నకు శ్రీదేవి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి?” అని అడగ్గా.. శ్రీదేవి వెంటనే స్పందిస్తూ.. “మా మమ్మీ ఇక్కడే ఉంది.. నేనిప్పుడు లవ్ గురించి ఏమైనా మాట్లాడితే నన్ను తంతుంది” అని నవ్వుతూ బదులిచ్చింది. ఆమె చమత్కారానికి అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. గతేడాది మార్చి 14న విడుదలైన ‘కోర్ట్’ సినిమా కంటే, ఈ ఏడాది మార్చి 13న రాబోతున్న ‘బ్యాండ్ మేళం’ పెద్ద విజయాన్ని సాధించాలని ఆమె కోరుకుంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ మరియు మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై యువతలో మంచి అంచనాలే ఉన్నాయి.
