Chiranjeevi Shocking Comments: ‘ఆచార్య’ ఫెయిల్యూర్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

భారీ అంచనాలతో విడుదలైన ‘ఆచార్య’ ఫెయిల్యూర్ పై మెగాస్టార్‌ చిరంజీవి మొదటిసారి పెదవి విప్పారు.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 05:19 PM IST

భారీ అంచనాలతో విడుదలైన ‘ఆచార్య’ ఫెయిల్యూర్ పై మెగాస్టార్‌ చిరంజీవి మొదటిసారి పెదవి విప్పారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్ లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడూ చెప్పని విషయాలు చెప్పారు. ఆచార్య చిత్రం అపజయం తనను ఏమాత్రం బాధించలేదని చెప్పారు. ‘‘కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో విజయం వచ్చినప్పుడు బాగా ఆనందించేవాడిని. పరాజయం వస్తే బాధపడేవాడిని. కానీ ఆ రోజులు గడిచిపోయాయి. మొదటి 15 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. మానసికంగా, శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం తెలుసుకున్నాను.

నటుడిగా పరిణతి చెందిన తర్వాత సినిమా పరాజయాలు నన్నెప్పుడూ బాధపెట్టలేదు. విజయాన్ని తలకెక్కించుకోలేదు. సినిమా ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. మన పనిలో మనం బెస్ట్‌ ఇస్తామంతే. ‘ఆచార్య’ పరాజయం నన్నస్సలు బాధించలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేము చేశాం. ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క చిన్న విచారం ఏంటంటే.. చరణ్‌ నేను కలిసి మొదటిసారి సినిమా చేశాం. అది హిట్‌ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే ఇంతటి జోష్‌ రాకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు’’ అని చిరంజీవి తన మనసులోని మాటలను చెప్పారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య ధర్మస్థలి, పాదఘట్టం అనే ఆసక్తికర అంశాలతో రూపొందింది. చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ప్రమోషన్ లో ఉన్నారు. దసరా కానుకగా ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రంపైన చిరంజీవితోపాటు నిర్మాతలకు, అభిమానులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి.