సినిమాల్లోనే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో అని కాక రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్(Chiranjeevi Blood Bank) స్థాపించి ఎంతోమందికి ప్రాణాపాయ స్థితిలో రక్తం అందించి కాపాడారు చిరంజీవి. ఆయన మీద అభిమానంతో అభిమానులు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి బ్లడ్ డొనేట్(Blood Donation) చేస్తూ ఉంటారు. తాజాగా మరో పెద్ద సాయం చేశారు చిరంజీవి.
అత్యవసర సమయాల్లో ఆదుకునే క్రమంలో ఇప్పటికే లక్షల యూనిట్ల రక్తాన్ని చిరంజీవి ఉచితంగా అందించారు. అటువంటి ఉదారతనే మరోసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా చేశారు. పేదరోగుల కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి 100 యూనిట్స్, గాంధీ ఆసుపత్రికి 100 యూనిట్స్, నీలోఫర్ ఆసుపత్రికి 100 యూనిట్స్, వరంగల్ లో ప్రభుత్వ ఆసుపత్రికి 100 యూనిట్స్, మహబూబ్ నగర్ ఆసుపత్రికి 100 యూనిట్స్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం నిధులను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అందించారు.
ఆయా ఆసుపత్రుల్లో పేద రోగులు, డబ్బులు పెట్టి కొనుక్కునే స్థోమత లేని రోగులకు ఈ రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున అందించనున్నారు. నేడు 500 యూనిట్ల రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి ఆధ్వర్యంలో పంపించారు. అభిమానులు చేసే ఈ రక్తదానం ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని, ఈ కార్యక్రమంలో అండగా నిలిచిన అభిమానులను, రక్తదాతలను డాక్టర్ మాధవి ప్రశంసించారు. ఇంత మంచి పని చేసినందుకు మరోసారి అన్నయ్య మనసు బంగారం అంటూ చిరంజీవిని అభినందిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.
Also Read : Jagapathi Babu: నా రెమ్యునరేషన్ తగ్గించి మరి రుద్రంగి సినిమా చేశాను. కానీ..!