Akhanda 2 : నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ డిసెంబర్ 12న విడుదలై మంచి స్పందన పొందుతోంది. మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమాపై లాజిక్ లేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఈ అంశంపై స్పందించిన బోయపాటి శ్రీను, సినిమా కథ పూర్తిగా లాజిక్కు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని వివరించారు .
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘ అఖండ 2 ’ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు వాయిదాల తర్వాత విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ పవర్ఫుల్ ప్రెజెన్స్, బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు, మాస్ డైలాగులు అభిమానులను ఉర్రూతలూగించాయి. థియేటర్లలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుండగా, సోషల్ మీడియాలో కూడా సినిమాపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే పాజిటివ్ టాక్తో పాటు, కొంతమంది నెటిజన్లు సినిమాలోని కొన్ని సన్నివేశాలు లాజిక్స్కు అతీతంగా ఉన్నాయంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రోలర్స్కి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
సినిమాలో లాజిక్ లేదన్న ఆరోపణలను బోయపాటి పూర్తిగా ఖండించారు. తాను కథను రాసుకునే సమయంలో ప్రతి అంశాన్ని లాజిక్కు లోబడి డిజైన్ చేశానని ఆయన తెలిపారు. సినిమా అన్నాక అందరికీ ఒకేలా నచ్చాల్సిన అవసరం లేదని, ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవడం సహజమని అన్నారు. అయితే విమర్శలు చేసే వారు సినిమాలోని నేపథ్యాన్ని, చెప్పాలనుకున్న కాన్సెప్ట్ను పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎక్కడా నిర్లక్ష్యంగా కథను రాయలేదని, ప్రతి సన్నివేశానికి ఓ కారణం ఉంటుందని స్పష్టం చేశారు.
అఖండ పాత్రకు సంబంధించిన అష్టసిద్ధి అంశంపైనా బోయపాటి వివరణ ఇచ్చారు. అష్టసిద్ధి సాధన అనేది కొన్ని రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని, దానికి దాదాపు 14 నుంచి 16 ఏళ్ల పాటు కఠినమైన సాధన అవసరమవుతుందని ఆయన తెలిపారు. ఆ సాధన పూర్తయిన తర్వాత సాధకుడికి దైవ శక్తులు లభిస్తాయని చెప్పారు. సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ను చూపించామని, అఖండ అష్టసిద్ధి సాధన పూర్తి చేసుకున్న తర్వాత అతడి స్పర్శకే అసాధారణమైన పరిణామాలు జరుగుతాయన్న సంకేతాలను ముందుగానే ఇచ్చామని అన్నారు. ఈ పాయింట్ను గమనించకుండా కేవలం కొన్ని సన్నివేశాలను తీసుకుని ట్రోలింగ్ చేయడం సరైన విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
సినిమాల్లో ప్రతి విషయం డాక్యుమెంటరీలా ఉండాలన్న ఆలోచన తప్పని బోయపాటి పేర్కొన్నారు. ఇది మాస్ ఆడియన్స్ కోసం రూపొందించిన కమర్షియల్ సినిమా అని, అందులో మైథలాజికల్ ఎలిమెంట్స్, ఆధ్యాత్మిక భావనలు సహజంగానే ఉంటాయని అన్నారు. అఖండ పాత్రను ఒక సాధారణ మనిషిగా కాకుండా, ఓ ప్రత్యేక శక్తిని ప్రతిధ్వనించే పాత్రగా చూపించామన్న విషయాన్ని ప్రేక్షకులు గుర్తించాలన్నారు. లాజిక్ లేదన్న విమర్శలు తనను ఏమాత్రం కలచివేయలేదని, థియేటర్లలో ప్రేక్షకుల స్పందనే తనకు అసలైన సమాధానమని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల ‘అఖండ 2’ సక్సెస్ మీట్లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ… ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా చూపించనున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, ధర్మం వంటి అంశాలను ప్రతిబింబించే సినిమా కావడంతో, ప్రధానికి ఈ చిత్రం చూపించాలనే కోరిక ఉందన్నారు. సరైన సమయం, అవకాశం దొరికితే ప్రత్యేక షో ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో ‘అఖండ 2’పై చర్చ మరింత ఊపందుకోగా, అభిమానులు ఈ షో నిజమవుతుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
