నటుడు, నిర్మాత బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలున్నాయనే విషయం తెలిసిందే. అయితే గతంలో భీమ్లానాయక్ ప్రీరిలీజ్ వేడుకకు బండ్ల రాలేకపోవడం, అప్పట్నుంచీ వారిద్దరి మధ్య దూరం పెరిగినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ కలవలేదు. చెప్పాలంటే బండ్ల గణేష్ కి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. బండ్ల గణేష్ చేసిన సంధి ప్రయత్నాలన్నీ విఫలం చెందాయట. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్న వాదన తెరపైకి వచ్చింది. అప్పుడప్పుడు బండ్ల గణేష్ ట్వీట్స్ పవన్ ని టార్గెట్ చేస్తున్నట్లు ఉంటున్నాయి.
అదే సమయంలో పవన్ తనకు దూరం కావడానికి త్రివిక్రమ్ కారణం అని బండ్ల గణేష్ గట్టిగా నమ్ముతున్నాడట. ఆయన తాజా ట్వీట్ దీన్ని ధృవపరిచింది. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు… ‘పవన్ అన్నని అపార్థం చేసుకొని దూరం కావద్దు. ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి మీలాంటి వాళ్ళు రిలీఫ్. సమయం చూసుకొని ఆయన్ని ఒకసారి కలువు’, అని సలహా ఇచ్చాడు. పవన్ అభిమాని ట్వీట్ కి స్పందించిన బండ్ల గణేష్… ‘మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం, ఏం చేద్దాం బ్రదర్’, అని రిప్లై ఇచ్చాడు.
అయితే గతంలో బహిరంగంగానే త్రివిక్రమ్ పై మండిపడ్డ బండ్ల గణేశ్ మరోసారి గురూజీని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ ట్వీట్ లో ఏకంగా త్రివిక్రమ్ ను డాలర్ శేషాద్రి అని పోల్చడం షాక్ కు గురిచేసింది. మొత్తంగా బండ్ల ట్వీట్ ను గమనిస్తే త్రివిక్రమ్ తనకు అడ్డుగా మారాడని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం బండ్ల గణేశ్ ట్వీట్ సోషల్ మీడియా సర్కిల్ లో వీపరితంగా వైరల్ అవుతోంది. మరి ఈ ట్వీట్ చూసైనా పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? అనేది వేచి చూడాల్సిందే!
మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ ………! https://t.co/QwK0vGQlcZ
— BANDLA GANESH. (@ganeshbandla) March 18, 2023