అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా హీరో బాలక్రిష్ణ చేసిన చేసిన ఆసనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన యోగ ఫోటోలను బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి విడుదల చేసింది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ టాలీవుడ్ హీరో బాలక్రిష్ణ హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో యోగాసనాలు వేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఉన్న బాలకృష్ణ వివిధ ఆసనాల ద్వారా ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు.
`యోగా` పదం సంస్కృతంలోని యజ అన్న పదం నుంచి పుట్టిందని, ‘యజ’ అంటే దేన్నైనా ఏకం చేయగలగడం అని అర్థమని వివరించారు. మనస్సును, శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మికతను ఇచ్చేది యోగా అని వర్ణించారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటని బాలక్రిష్ణ కీర్తించారు. భారత దేశంలో వేదకాలం నుంచి యోగా ఉన్నట్టు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయని గుర్తు చేశారు. మానసిక, శారీరక ప్రశాంతత, ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని తెలిపారు. భారతదేశం చొరవతో 177 దేశాల మద్దతు ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014లో ప్రకటించిందని బాలకృష్ణ పేర్కొన్నారు. ఏడాదిలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు జూన్ 21 అని, అందుకే ఆ రోజున యోగా డే పాటిస్తారని వివరించారు.