Anasuya Sengupta : ఫ్రాన్స్లో ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024’ అట్టహాసంగా జరుగుతోంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మే 14న ప్రారంభం కాగా.. ఇవాళ్టితో ముగియనుంది. ఈక్రమంలో భారత్కు ఒక గుడ్ న్యూస్ వినిపించింది.ఈ వేడుకల్లో భారతీయ నటి అనసూయ సేన్గుప్తా కొత్త చరిత్ర సృష్టించారు. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో ఉత్తమ నటిగా ఆమె అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఈ విశ్వ విఖ్యాత చిత్రోత్సవంలో అవార్డు అందుకున్న తొలి భారతీయురాలిగా ఆమె ఘనతను సొంతం చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అనసూయ సేన్గుప్తా గురించి మనదేశంలో చాలామందికి తెలియదు. కోల్కతాలో జన్మించిన అనసూయ గోవాలో నివసిస్తుంటారు. జాధవ్పూర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసేవారు. బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బోజనోవ్ తెరకెక్కించిన ‘ది షేమ్లెస్’ మూవీలో ఆమె పోషించిన ఓ పాత్రకుగానూ ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో అవార్డు లభించింది. ఈ సినిమాలో ప్రముఖ నటి మితా వశిస్ట్ కూడా నటించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మనదేశంతో పాటు నేపాల్లోనూ నెలన్నర పాటు జరిగింది.
బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బోజనోవ్తో అనసూయకు(Anasuya Sengupta) ఫేస్బుక్ వేదికగా స్నేహం ఏర్పడింది. ఒక రోజు అకస్మాత్తుగా తనకు ఆడిషన్ టేప్ను పంపమని అనసూయను బోజనోవ్ కోరారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే తన ఆడిషన్ టేప్ను పంపింది. దాన్ని చూసిన బోజనోవ్ .. తన సినిమాలో నటించే అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈవిధంగా అనసూయ యాక్టింగ్ కెరీర్కు పునాది పడింది. ‘ది షేమ్లెస్’ మూవీ కథ ఏమిటంటే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళ హత్య అభియోగాలను ఎదుర్కొంటూ వేధింపులకు గురవుతుంటుంది. ఈక్రమంలో ఆ మహిళ మరో చోటుకు పారిపోయి ఓ సెక్స్ వర్కర్ల కుటుంబం వద్ద ఆశ్రయం పొందుతుంది. ఈక్రమంలో ఆమె వ్యభిచారంలోనూ పాల్గొనాల్సి వస్తుంది. ఈ పాత్రను అనసూయే పోషించింది. అంతకుముందు ఫర్గెట్ మీ నాట్, సత్యజిత్ రే, మసాబా మసాబా అనే టీవీ సీరియళ్లకు ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసిన అనుభవం అనసూయకు ఉంది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును అందుకుంటూ అనసూయ ఎమోషనల్ అయింది. ఈ అవార్డును అట్టడుగు వర్గాల నటులకు అంకితమిచ్చింది. చప్పట్లు కొడుతూ.. చెమర్చిన కళ్లతో ఆమె తన ప్రసంగాన్ని ముగించింది.