Actress Tamannaah : వయాకమ్ కంపెనీ ఫిర్యాదు మేరకు ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్లను ఫెయిర్ప్లే యాప్లో తమన్నా(Actress Tamannaah) లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల తమకు కోట్లలో నష్టం వాటిల్లిందని వయాకమ్ కంపెనీ ఆరోపించింది. ఐపీఎల్ 2023 మ్యాచ్ల ప్రసార హక్కులను అధికారికంగా తామే దక్కించుకున్నామని వయాకమ్ గుర్తుచేసింది. తమన్నా భాటియా ఫెయిర్ప్లే యాప్ను ప్రమోట్ చేశారని, అందుకే ఆమెను సాక్షిగా విచారణకు పిలిచారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక ఇదే కేసులో యాక్టర్ సంజయ్ దత్కు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించినప్పటికీ.. గైర్హాజరయ్యారు. ఆ విచారణ జరిగిన రోజున తాను దేశంలో లేనని సంజయ్ దత్ తెలిపారు. తన స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవడానికి మరో తేదీని సూచించాలని పోలీసులను ఆయన కోరారు.
We’re now on WhatsApp. Click to Join
వయాకామ్ మరిన్ని ఆరోపణలు
- ఫెయిర్ప్లే యాప్ను ప్రమోట్ చేసేందుకు ఆ కంపెనీ వివిధ సంస్థల ఖాతాల నుంచి చాలామంది సెలబ్రిటీలు, కళాకారులకు డబ్బులు ఇచ్చిందని పోలీసులకు వయాకామ్ ఫిర్యాదు చేసింది.
- నెదర్లాండ్స్ పరిధిలోని కురాకో దేశంలో ఉన్న ప్లే వెంచర్ అనే కంపెనీ ఖాతా నుంచి సంజయ్ దత్ డబ్బులు అందుకున్నారని వయాకామ్ ఆరోపించింది. ఈ డబ్బులు అందాకే ఆయన ఫెయిర్ ప్లే యాప్ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారని తెలిపింది.
- దుబాయ్లో ఉన్న లైకోస్ గ్రూప్ ఎఫ్జెడ్ఎఫ్ కంపెనీ ఖాతా నుంచి మరో ప్రముఖ నటుడు డబ్బు అందుకున్నారని వయాకామ్ కంపెనీ పేర్కొంది.
- దుబాయ్కే చెందిన ట్రిమ్ జనరల్ ట్రేడింగ్ ఎల్ఎల్సి అనే కంపెనీ ఖాతా నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ డబ్బు పొందారని వయాకామ్ కంపెనీ తెలిపింది.
‘పికాషో’.. పాకిస్తాన్కు ప్రతినెలా రూ.5 కోట్లు
మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు అదే ఎఫ్ఐఆర్లో ‘పికాషో’ అనే యాప్ను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ యాప్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించగా.. దీనికి గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చే డబ్బు పాకిస్తాన్కు వెళుతున్నట్లు వెల్లడైంది. పికాషో అనే యాప్లో అన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ల పైరసీ కాపీలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. ఈ యాప్కు సంబంధించిన గూగుల్ యాడ్ సెన్స్తో ముడిపడిన బ్యాంక్ ఖాతా పాకిస్తాన్లోని రహీమ్ యార్ ఖాన్ నగరంలో ఉంది. ఈ యాప్కు భారీగా నెటిజన్ల ట్రాఫిక్ వస్తుంటుందని, దాని ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్లోని నిందితుల బ్యాంకు ఖాతాల్లో ప్రతినెలా రూ. 5 కోట్ల ఆదాయం జమ అవుతుంటుంది. సైబర్ క్రైం పోలీసులు ఈ యాప్లపై ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు.