Site icon HashtagU Telugu

UPI Update : మీరు షాపింగ్‌లో వినియోగించే.. యూపీఐ ఫీచర్‌కు గుడ్‌బై !

Upi Update Upi Payment Request To Mobile Number

UPI Update : యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) లావాదేవీలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. ప్రజలంతా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసేందుకు అలవడిపోయారు. ఈ తరుణంలో ఒక కీలక మార్పు చేసే దిశగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అడుగులు వేస్తోంది.  తద్వారా యూపీఐ వినియోగదారులు మోసాల బారినపడకుండా కాపాడాలని భావిస్తోంది.

Also Read :Guntur Air Taxi : మేడిన్ గుంటూరు ‘ఎయిర్ ట్యాక్సీ’.. యువతేజం చావా అభిరాం కసరత్తు

‘కలెక్ట్‌ రిక్వెస్ట్‌‌’ నిలిపివేత దిశగా.. 

యూపీఐ(UPI Update)లో ఒక ఆప్షన్ ఉంది. ఎవరికైనా మనం పేమెంట్  రిక్వెస్టును (కలెక్ట్‌/పుల్‌ రిక్వెస్ట్‌) పంపొచ్చు. అవతలి వారు.. మీకు ఎంత అమౌంటును పంపాలో అందులో పేర్కొనాలి. మనం రిక్వెస్టును పంపగానే, అవతలి వారికి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ నోటిఫికేషన్‌ను వాళ్లు క్లిక్ చేయగానే.. పేమెంట్ గేట్ వే ఓపెన్ అయిపోతుంది. పేమెంట్ రిక్వెస్టును తొలుత అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని సదరు వ్యక్తికి చెల్లించేందుకు ప్రొసీడ్ కావాలి. సీక్రెట్ పిన్‌ను ఎంటర్ చేయాలి. ఈవిధంగా పేమెంట్ పూర్తయిపోతుంది. ఈ పద్ధతిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదులు ఎన్‌పీసీఐకు అందాయి. అందుకే వినియోగదారుల నుంచి వ్యాపారులు డబ్బులు వసూలు చేసుకునేందుకు అమల్లో ఉన్న ‘కలెక్ట్‌/పుల్‌ రిక్వెస్ట్‌’ పద్ధతిని దశలవారీగా నిలిపేయాలని ఎన్‌పీసీఐ యోచిస్తోంది. దీనిపై ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతోంది.

షాపింగ్‌లో మీరు చేసే పేమెంట్..

డీమార్ట్, రిలయన్స్ మార్ట్‌తో పాటు అన్ని రకాల షాపింగ్‌ సెంటర్లకు వెళ్లినప్పుడు చాలామంది యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారు.  ఆయా షాపింగ్ సెంటర్ల బిల్లింగ్ విభాగంలో ఉండే సిబ్బంది.. యూపీఐతో లింక్ అయిన మన ఫోన్‌ నంబరును అడుగుతారు. షాపింగ్ బిల్లు మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా.. మనం చెప్పిన యూపీఐ యాప్‌లోకి  ‘కలెక్ట్‌ /పుల్‌ రిక్వెస్ట్‌’ను పంపుతారు. మనం క్లిక్‌ చేసి, యూపీఐ పిన్‌ ఎంటర్ చేసి, పేమెంట్ చేస్తాం. అయితే ఈ పద్ధతిని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయట.  వినియోగదారుల అనుమతితో నేరుగా బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డెబిట్‌ చేసుకుంటున్నాయట. అందుకే వినియోగదారుల ఆర్థిక భద్రతను పెంచేందుకుగానూ ‘కలెక్ట్‌ /పుల్‌ రిక్వెస్ట్‌’ను విడతల వారీగా తీసేయాలని ఎన్‌పీసీఐ డిసైడ్ అయ్యిందట.  పుల్‌/కలెక్ట్‌ రిక్వెస్ట్‌ లావాదేవీలను తొలగిస్తే, ఆటో డెబిట్, రికరింగ్‌ చెల్లింపులపై ప్రభావం పడొచ్చు. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా కొత్త పద్ధతిని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.