పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త. సాధారణంగా అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఆకాశాన్ని తాకాలి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత 20 రోజుల్లో కేవలం మూడు నాలుగు రోజులు మినహా, మిగిలిన సమయమంతా ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఆకస్మిక ‘కరెక్షన్’ కారణంగానే ఈ మార్పు చోటుచేసుకుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే.. ధరల తగ్గుదల తీవ్రత స్పష్టంగా అర్థమవుతుంది. మార్చి 21 నాటికి 22 క్యారెట్ల బంగారం ధర తులం (10 గ్రాములు) పై రూ. 1200 తగ్గి రూ. 1,36,550కి చేరుకోగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 1370 తగ్గి రూ. 1,48,910 వద్ద కొనసాగుతోంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్లో కిలో వెండిపై రూ. 5 వేలు తగ్గి ప్రస్తుతం రూ. 2.60 లక్షల వద్ద ఉంది. వారం వ్యవధిలోనే వెండి ధర సుమారు రూ. 30 వేల వరకు పతనం కావడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒకే రోజులో 200 డాలర్లకు పైగా పడిపోయి 4492 డాలర్లకు చేరడం, వెండి ధర కూడా 10 శాతం మేర కరెక్షన్కు గురికావడం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ. 93.57 వద్ద ఆల్టైమ్ కనిష్ఠానికి పడిపోయినప్పటికీ, అంతర్జాతీయంగా లోహాల ధరలు కుప్పకూలడంతో స్థానిక మార్కెట్లో సామాన్యులకు ఊరట లభిస్తోంది. వరుసగా తగ్గుతున్న ఈ ధరలు చూస్తుంటే, వివాహాల సీజన్ లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
