GOLD బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాటి జోరు కొనసాగింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,51,500కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ. 5,000 పెరిగి రూ. 2,37,000కి ఎగబాకింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కొనుగోళ్ల ఆసక్తి పెరగడం ధరల పెరుగుదలకు దోహదపడింది.
ఇరాన్తో యుద్ధం రెండు, మూడు వారాల్లోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు బలపడ్డాయి. ఆసియా ట్రేడింగ్లో కామెక్స్ (COMEX) గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 1.25 శాతం పెరిగి 4,737 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు కూడా ధరలకు మద్దతునిచ్చాయి. దేశవ్యాప్తంగా సగటున 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,250 మేర పెరిగింది.
ప్రస్తుతం ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 14,827 పలుకుతుండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 13,591గా ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) లెక్కల ప్రకారం సోమవారం నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,733గా ఉంది. మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు కావడంతో అవే ధరలు కొనసాగాయి.
అయితే, ఈ తాజా పెరుగుదలకు ముందు మార్చి నెలలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఇంధన ధరల పెరుగుదల, వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి వంటి కారణాలతో గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మార్చిలో పసిడి విలువ దాదాపు 15 శాతం క్షీణించింది. కనిష్ఠ స్థాయుల వద్ద పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
