డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల రక్షణ కోసం ‘గంట విరామం’ అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ఆన్లైన్ మోసగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి నిమిషాల్లో అకౌంట్లు ఖాళీ చేస్తున్న నేపథ్యంలో, ఆర్బీఐ ఒక ‘సేఫ్టీ విండో’ను ప్రతిపాదించింది. దీని ప్రకారం, మీరు ఎవరికైనా రూ. 10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ (PhonePe, Google Pay) ద్వారా పంపినప్పుడు, ఆ డబ్బు వెంటనే అవతలి వ్యక్తి ఖాతాలో జమ అవ్వదు. కనీసం ఒక గంట పాటు ఆ లావాదేవీ హోల్డ్లో ఉంటుంది. ఈ లోపు మీరు పొరపాటున డబ్బు పంపినా లేదా అవతలి వ్యక్తి మోసగాడని తెలిసినా, వెంటనే ఆ ట్రాన్సాక్షన్ను క్యాన్సిల్ చేసే వెసులుబాటు కలుగుతుంది. అయితే, మీరు రెగ్యులర్గా డబ్బు పంపే వ్యక్తుల జాబితా (Whitelisted users) మరియు బిల్లు చెల్లింపులకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఉంటుంది.
వృద్ధులకు ప్రత్యేక రక్షణ – కిల్ స్విచ్ సదుపాయం
వృద్ధులు మరియు దివ్యాంగులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఆర్బీఐ మరో కీలక రక్షణ కవచాన్ని తెస్తోంది. దీని ప్రకారం, వృద్ధులు రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పంపాలంటే, వారు ముందుగా ఎంచుకున్న ఒక ‘నమ్మకస్తుడైన వ్యక్తి’ (Trusted Person) ఆ లావాదేవీని ధృవీకరించాల్సి ఉంటుంది. దీనితో పాటు, ఖాతాలో ఏదైనా అనుమానాస్పద కదలిక కనిపిస్తే తక్షణం అన్ని డిజిటల్ సేవలను నిలిపివేసేలా “కిల్ స్విచ్” (Kill Switch) అనే బటన్ను బ్యాంకులు అందుబాటులోకి తేవాలి. దీన్ని నొక్కిన వెంటనే అకౌంట్ నుంచి పైసా కూడా కదలకుండా లాక్ అయిపోతుంది.
నిఘా నీడలో భారీ డిపాజిట్లు
ఖాతాల్లోకి వచ్చే సొమ్ముపై కూడా బ్యాంకులు నిఘా పెంచబోతున్నాయి. ఏదైనా వ్యక్తిగత ఖాతాలోకి ఏడాదికి రూ. 25 లక్షల కంటే ఎక్కువ జమ అయితే, ఆ సొమ్ము మూలాలు (Source) ఏంటో బ్యాంకులు ఆరా తీస్తాయి. సంతృప్తికరమైన సమాధానం లభించిన తర్వాతే ఆ డబ్బును ఖాతాలోకి మళ్లిస్తారు. ప్రస్తుతం ఈ కొత్త నిబంధనలు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. వీటిపై ప్రజలు, నిపుణుల నుంచి మే 8వ తేదీ వరకు సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత తుది మార్పులతో ఈ రూల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. డిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితం చేయడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశం.
